ముందు కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తుల లెక్క చెప్పండి .. వ్యవసాయేతర ఆస్తుల సర్వేపై ప్రతిపక్షాల ఫైర్
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ భూములతో పాటుగా, వ్యవసాయేతర ఆస్తులపై కూడా సర్వే చేయించి వివరాలు సేకరించే పనిలో పడింది. ఇళ్ళు, షాపులు , ఖాళీ స్థలాలు, ఇలా ప్రజల ఆస్తుల వివరాలను తెలుసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వే చేపట్టింది. వీటన్నింటినీ ఆన్లైన్ చేయాలని, మెరూన్ కలర్ పాస్ బుక్ ను ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి .
వ్యవసాయేతర ఆస్తుల సర్వేపై మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీలు
కెసిఆర్ రాష్ట్రాన్ని సొంత కంపెనీలా మార్చుకుంటున్నారని , ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని భగ్గుమంటున్నాయి ప్రతిపక్షాలు.కెసిఆర్ ముందు తన ఆస్తుల లెక్క చెప్పి, తర్వాత ప్రజల ఆస్తుల లెక్కలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాయి. కెసిఆర్ తన ఫ్యామిలీ ఆస్తుల వివరాలన్నింటినీ బయటపెట్టాలని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో ఆస్తుల వివరాలను నమోదు చేయాలని, లేదంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందమని, భవిష్యత్తులో వారసులకు ఆస్తులు సంక్రమించవు అని బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రజల వ్యక్తిగత గోప్యతకు భద్రత లేకుండా సర్వే
సర్వే పేరుతో ప్రజలందరినీ గుప్పిట్లో పెట్టుకునేందుకే కెసిఆర్ ఈ తరహా చర్యలకు దిగుతున్నారని మండిపడుతున్నారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఈ నిర్ణయం ఉందని నిప్పులు చెరుగుతున్నారు.ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి జీవో లేకుండా 15 రోజుల్లో సర్వేను పూర్తిచేయాలని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఎలక్షన్లలో లబ్ధి పొందడం కోసమే ఈ విధంగా చేస్తున్నారని, ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని వారంటున్నారు. దీనిపై న్యాయ పోరాటానికి కొందరు నేతలు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా ఉంది.
ఇదేమైనా ప్రభుత్వమా.. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా ? బండి సంజయ్
తెలంగాణ సర్కార్ వ్యవసాయేతర ఆస్తుల జాబితా పేరుతో సర్వే చేయిస్తూ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, ప్రజలు ఇళ్లకు వెళ్లి అడ్డగోలు ప్రశ్నలు వేసి వ్యక్తిగత వివరాలను తీసుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భగ్గుమంటున్నారు. ముందు కెసిఆర్ తన ఫ్యామిలీ ఆస్తుల వివరాలు అన్నింటినీ బయటపెట్టాలని, కెసిఆర్ కు ఇష్టం వచ్చినట్లు సర్వేలు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. ప్రజల వ్యక్తిగత జీవితంలోకి ప్రభుత్వం ఎలా చొరబడుతుంది అని ప్రశ్నిస్తున్నారు. ఇదేమైనా ప్రభుత్వమా లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా అని మండిపడుతున్నారు.
ప్రజల ఆస్తుల లెక్కలకంటే ముందు మీ ఆస్తుల లెక్క చెప్పండి : భట్టి విక్రమార్క
ప్రజలను ఇన్ని లెక్కలు అడుగుతున్న సీఎం కేసీఆర్ తమ కుటుంబ ఆస్తులు లెక్కలు ఎప్పుడైనా చెప్పారా అంటూ ప్రశ్నిస్తున్నారు .ఆస్తుల వివరాలు సేకరించి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ పని. ప్రభుత్వానికి ఆ వివరాలు దేనికీ అంటూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా చేస్తున్న ఈ సర్వేను అడ్డుకోవడానికి ఎక్కడిదాకైనా వెళ్తామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క తేల్చి చెప్తున్నారు.
Recommended Video
సర్వే పెద్ద కుట్ర ... ప్రజల ఆస్తుల భద్రతపై అనుమానాలు : కోదండరాం
సీఎం కేసీఆర్ చేస్తున్న ఈ సర్వే తో ప్రజల ఆస్తులకు భద్రత ఉంటుందా అన్న అనుమానం కూడా లేకపోలేదని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ప్రజలనుంచి ఆధారాలతో సహా 50 రకాల వివరాలు ఎలా సేకరిస్తారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ చెల్లించిన తర్వాత మళ్లీ ఎల్ఆర్ ఎస్ కు ఎందుకు చెల్లించాలని కూడా కోదండరాం ప్రశ్నిస్తున్నారు.సర్వే పేరుతో ప్రజలందరి ఆస్తుల వివరాలు , వ్యక్తిగత సమాచారం సేకరించటం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న పన్నాగం అని కోదండరాం మండిపడుతున్నారు.