ట్విస్ట్: 'మంత్రి ప్రోద్బలంతో నటుడు సామ్రాట్ రెడ్డిపై కేసు, సొంతింటికి వెళ్తే తప్పేంటి'
హైదరాబాద్: నటుడు సామ్రాట్ రెడ్డిపై అతని భార్య హర్షిత మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. అతనికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. సామ్రాట్ చర్లపల్లి జైలుకు తరలించారు.
Recommended Video
సామ్రాట్ తనను తీవ్రంగా వేధించేవాడని భార్య హర్షిత ఆరోపించారు. తన భర్త సామ్రాట్కు ఇతర అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని డ్రగ్స్ కూడా తీసుకుంటారని చెప్పారు. ఆమె తండ్రి కూడా సామ్రాట్ రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేశారు.
పరిశ్రమలో అమ్మాయిలతో, నాతో అలా: భార్య, అది తప్పే కానీ: నటుడు సామ్రాట్ ఏమన్నారంటే
ఆ ఇంట్లోకి వెళ్తే ట్రెస్ పాసింగ్ ఎలా
అయితే, సామ్రాట్ రెడ్డి తల్లి జయారెడ్డి మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. ఓ మంత్రి ప్రోద్బలంతో సామ్రాట్ పైన కేసు నమోదు చేశారని ఆమె ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తోంది. సామ్రాట్ పైన నవంబరులో గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారని, అక్కడి కౌన్సిలర్ల సలహా మేరకు భార్యాభర్తలు తన కుమార్తె ఇంట్లో ఉంటున్నారని చెప్పారు. ఆ ప్లాట్ తన కుమార్తెదేనని సొంతింట్లోకి సామ్రాట్ వెళ్తే ట్రెస్ పాసింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు.
సామ్రాట్ రెడ్డి వాదన
సామ్రాట్ రెడ్డి కూడా అదే చెప్పారు. తనపై భార్య, అత్తమామల ఆరోపణలు బాధించాయన్నారు. తన ఇంట్లోని వస్తువులు, తన వస్తువులు తీసుకు వెళ్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. పదిహేనేళ్లుగా తాను ఇండస్ట్రీలో ఉన్నానని, మహిళలు అంటే తనకు గౌరవం అన్నారు. లేనిపోని సెక్షన్ల కింద తనపై కేసు నమోదు చేయడం సరికాదని వాపోయారు.
భార్య ఫిర్యాదు ఇలా
తన భర్త ఇంట్లో దొంగతనం చేశాడని, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకెళ్లాడని, డ్రగ్స్కు బానిసై హింసించాడని, వరకట్నం కోసం వేధించాడని సామ్రాట్ రెడ్డిపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించారు. 448, 427, 380 సెక్షన్ల కింద సామ్రాట్పై కేసు నమోదు చేశారు.
పోలీసులు చెప్పిన వివరాలు
మాదాపూర్లో నివాసం ఉండే జయంత్ రెడ్డి కుమారుడు సామ్రాట్ రెడ్డికి రాజేంద్రనగర్ ఉప్పర్పల్లికి చెందిన కృష్ణారెడ్డి కుమార్తె హర్షితా రెడ్డితో 2015 నవంబరు 29న వివాహం జరిగింది. కట్నం కింద రూ.కోటి విలువైన ఆభరణాలు, రూ.45 లక్షల నగదు, కోట్లు విలువ చేసే ఆస్తులు ఇచ్చారు. ఇకపై నటించనని హర్షితా రెడ్డి కుటుంబసభ్యులకు సామ్రాట్ మాట ఇచ్చాడు. పెళ్లైన కొద్దిరోజులకే సామ్రాట్, హర్షితల మధ్య గొడవలు మొదలయ్యాయి. డ్రగ్స్కు బానిసైన సామ్రాట్ భార్యపై అనుమానంతోపాటు ఆమె ఆస్తులను తన పేరిట మార్చి వీలునామా తయారు చేయాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్ద
తాను పుట్టింటికి వెళ్లిన సమయంలో వరకట్న వేధింపులకు పాల్పడ్డాడని హర్షిత రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో 2017 నవంబరు 30న ఫిర్యాదు చేసింది. ఆ కేసులో అరెస్టయిన సామ్రాట్ బెయిల్పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి అతను తల్లిదండ్రుల వద్ద ఉంటుండగా హర్షిత తల్లితో కలిసి ఉంటోంది. సంక్రాంతికి హర్షిత ఉప్పర్పల్లికి వెళ్లింది. ఈ సమయంలో సామ్రాట్, అతడి అక్క సాహితితోపాటు అయిదుగురు వచ్చి హర్షిత ఉన్న ఇంటి తలుపులు బద్దలు కొట్టి సీసీ కెమెరాలు, ఆభరణాలు తీసుకువెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు.