విజయ్ ఆత్మహత్య: వనిత అరెస్ట్కు రంగం సిద్ధం, పరారీలో నిందితులు
హైదరాబాద్: నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో అతని భార్య వనితను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. తన చావుకు భార్య వనితతో పాటు మరో ఇద్దరు కారణం అంటూ విజయ్ సాయి ఉరి వేసుకోవడానికి మందు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.
Recommended Video
విజయ్ చివరి కోరిక: వెలుగులోకి వనితా రెడ్డితో ఆడియో సంభాషణ
దీనిని మరణ వాంగ్మూలంగా చేసుకొని వనితను అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. విజయసాయి ఆత్మహత్య తర్వాత కనిపించిన వనిత.. ఆ తర్వాత నుంచి అందుబాటులో లేకుండా పోయింది. దీంతో సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె ఎక్కడున్నది పోలీసులు గుర్తించారు.
కారు చుట్టూ వివాదం
ఆత్మహత్యకు ముందు రోజు వనిత తన కారును బలవంతంగా తీసుకు వెళ్లిందని విజయ సాయి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం వెలుగు చూసింది. దీంతో అసలు కారును బలవంతంగా ఎందుకు తీసుకు వెళ్లాల్సి వచ్చింది అనే కోణాల్లో పోలీసులు వనిత నుంచి రాబట్టాల్సి ఉంది. కాగా ఈ ఆత్మహత్య విషయంలో ముఖ్యంగా కారు చుట్టు వివాదం తిరుగుతోంది.
రెండు వేర్వేరు సెల్ఫీలు
తన మృతికి భార్య వనితతో పాటు లాయర్ శ్రీనివాస్, శశిధర్ కారణమంటూ ఆత్మహత్యకు ముందు విజయ్ తన సెల్ఫోన్లో తీసుకున్న రెండు వేర్వేరు సెల్పీల్లో స్పష్టం చేశారు. వీటిని పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. విజయ్ తండ్రి కేవీ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదులో ఈ ముగ్గురి పేర్లు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారు.
వనితకు నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లారు
వనితకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆమె నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె తల్లి ఉంది. వనిత గురించి పోలీసులు విచారించగా ఆమె సూర్యాపేటలో ఉన్నట్లు పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. తన కుమార్తెకు జ్వరంగా ఉందని, తాను పోలీస్ స్టేషన్కు వస్తానని పోలీసులకు చెప్పారని సమాచారం.
నిందితుల 3 నెలల కాల్ డేటా సేకరణ
లాయర్ శ్రీనివాస్ సెల్ఫోన్లో అందుబాటులో లేకపోవడంతో ఆయనను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శశిధర్ ప్రమేయంపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులకు సంబంధించిన మూడు నెలల కాల్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు.