చంద్రబాబుకు షాక్: వైసీపీలోకి జయసుధ, సాయంత్రం జగన్తో భేటీ.. ఇక ఏపీకి పరిమితమా?
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. 2009 ఎన్నికలకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కారణంగా ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. సికింద్రాబాద్ నుంచి పోటీచేసి గెలుపొందారు. వైయస్ మృతి అనంతరం కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా.. దూరంగా అన్నట్లుగా కనిపించారు.
డేటా చోరీ ఇష్యూ... ఇలా చేస్తున్నారు: టీడీపీ సేవామిత్ర, ఐటీ గ్రిడ్పై సీపీ ఏం చెప్పారంటే
ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి జయసుధ
అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మూడేళ్ల క్రితం... 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమెకు పార్టీ అధినేత చంద్రబాబు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. తెలుగు వారందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో తాను టీడీపీలో చేరినట్లు అప్పుడు ఆమె తెలిపారు. హైదరాబాద్కు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చింది చంద్రబాబేనని ప్రశంసించారు. ఇప్పుడు 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
జగన్ సమక్షంలో వైసీపీలోకి
జయసుధ గురువారం సాయంత్రం వైసీపీ అధినేత వైయస్ జగన్ను కలవనున్నారని తెలుస్తోంది. జగన్ సమక్షంలో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఉమ్మడి ఏపీలో జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. ఆమె రాజకీయ ఆరంగేట్రం, టిక్కెట్ విషయంలో నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కీలకంగా పని చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత రెండేళ్లకు ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఆమె టీడీపీ చేరినప్పటికీ, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనలేదు.
జయసుధ ఇక ఏపీకి పరిమితమవుతారా?
ఆమె తెలంగాణలోని సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పని చేశారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన జయసుధ, 2014లో ఓడిపోయారు. ఆమె తెలంగాణ నాయకురాలిగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు వైసీపీలో చేరుతున్నందున ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని భావించవచ్చు. తెలంగాణలో టీడీపీకి అయినా అంతో ఇంతో కేడర్ ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి టీడీపీ పోటీ చేసింది. కానీ వైసీపీ పోటీ కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఇక నుంచి పూర్తిగా ఏపీ రాజకీయాల్లో కీలకం కావొచ్చునని అంటున్నారు.