రాజకీయాల్లో తెలుగు సినీ నటులు: చక్రం తిప్పిన యాక్టర్లు వీరే
హైదరాబాద్: తెలుగు సినీ రంగంలో రాణించిన నటీ నటులు అనేక మంది రాజకీయాల్లో కూడ రాణించారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. అయితే మరికొందరు నటులు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పనిచేశారు.
Recommended Video
తమిళనాడు రాజకీయాల్లో మాదిరిగానే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడ అనేక మంది సినీ నటులు రాజకీయాల్లో రాణించారు. ఇప్పటికీ కూడ కొందరు సినీ నటులు రాజకీయాల్లో ఉన్నారు.
2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. ఆయితే ఆయన పార్టీకి కేవలం 18 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కాయి. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేన ఏర్పాటు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయనున్నారు.ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లే కాకుండా ఇతర నటులు కూడ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.
చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్
తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. పార్టీని ఏర్పాటు చేసిన 9 మాసాల్లోనే ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. విప్లవాత్మక పథకాలకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు.పేద ప్రజలకు టిడిపిని చేరువ చేశారు. కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే కాదు కేంద్రంలో కూడ నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కాంగ్రెసేతర పక్షాలను కూడగట్టడంలో ఎన్టీఆర్ ఆనాడు క్రియాశీలకంగా వ్యవహరించారు.
చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం
2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ఏర్పాటు చేశారు. అయితే ప్రజారాజ్యం ఏర్పాటు ఆ ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొంది. ఆ తర్వాత ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా కూడ చిరంజీవి పనిచేశారు.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు. 2018 మార్చిలో ఆయన రాజ్యసభసభ్యత్వం గడువు ముగియనుంది.
జనసేనాని
2014 ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అయితే జనసేనను ఏర్పాటు చేసినప్పటికీ ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపి కూటమికి మద్దతు పలికారు. 2014 ఎన్నికలకు పవన్ కళ్యాణ్
సూపర్స్టార్ కృష్ణ
సూపర్స్టార్ కృష్ణ కూడ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కృష్ణ నటించిన కొన్ని సినిమాలు పరోక్షంగా టిడిపికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆనాడు అభిప్రాయం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తరపున కృష్ణ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్గాంధీ స్పూర్తితో కృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారని అంటారు. రాజీవ్గాంధీ మరణించిన సమయంలో ఏలూరు నుండి కృష్ణ ఎంపీగా విజయం సాధించారు. టిడపికి వ్యతిరేకంగా ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆ సమయంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
బిజెపిలో చేరిన కృష్ణంరాజు
రెబెల్స్టార్ కృష్ణంరాజు బిజెపిలో చేరారు. 1998-99 సమయంలో బిజెపిలో చేరిన కృష్ణంరాజు బిజెపిలో చేరిన తర్వాత ఎంపీగా విజయం సాధించారు. అంతేకాదు కేంద్ర మంత్రిగా కూడ పనిచేశారు. ఆ సమయంలో బిజెపిలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. 2004లో బిజెపి ప్రభుత్వం ఓటమి పాలైన తర్వాత కృష్ణంరాజు కొంత కాలంగా పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో మరోసారి బిజెపిలో క్రియాశీలక పాత్ర పోషించనున్నట్టు కృష్ణంరాజు ప్రకటించారు.
ఒంగోలు నుండి ఎంపీగా జగ్గయ్య
కంచు కంఠంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జగ్గయ్య రాజకీయాల్లో కూడ రాణించారు. జగ్గయ్య 1967లో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరపున జగ్గయ్య విజయం సాధించారు. రాజకీయాల్లో జగ్గయ్య తనదైన ముద్ర వేశారు. విద్యార్థి దశలో జగ్గయ్య కాంగ్రెస్ పార్టీలోని సోషలిస్టు గ్రూపుతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత జయప్రకాష్ నారాయణ ప్రజా సోషలిస్టు పార్టీలో 1956 చేరారు. నెహ్రు పిలుపు మేరకు 1967లో జగ్గయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. సినిమా నటుడికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇవ్వడం ఇదే మొదటిసారి.
టిడిపిలో చేరిన శారద
ఊర్వశి శారదగా పేరు గాంచిన శారద టిడిపిలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆమె తెనాలి పార్లమెంట్ సభ్యురాలిగా టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. టిడిపి తరపున ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చంద్రబాబునాయుడు హయంలో కూడ ఆమె టిడిపికి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు.
టిడిపి, సమాజ్వాదీ పార్టీల్లోజయప్రద
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎన్టీఆర్ నుండి చంద్రబాబునాయుడు అధికారాన్ని చేజిక్కించుకొన్న తర్వాత పార్టీలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. సినీ నటి జయప్రద ఎంపీగా రాజ్యసభ ఎన్నికయ్యారు. చాలా కాలం పాటు జయప్రద టిడిపిలో కొనసాగారు. అయితే కారణాలేమిటో తెలియదు కానీ, టిడిపికి ఆమె దూరమయ్యారు. యూపీలోని సమాజ్వాదీ పార్టీలో చేరారు. సమాజ్వాదీ పార్టీ నుండి కూడ ఆమె ఎంపీగా విజయం సాధించారు.విచిత్రమేమిటంటే ఈ రెండు పార్టీల ఎన్నికల గుర్తులు సైకిల్ గుర్తులే కావడం గమనార్హం. అయితే తాజాగా సమాజ్వాదీ పార్టీ కూడ ఆమె ప్రస్తుతం దూరమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై కేంద్రీకరించనున్నట్టు ప్రకటించారు. ఏపీ రాజకీయాల్లోకి త్వరలో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
టిడిపిలో మోహన్బాబు
ఎన్టీఆర్ స్పూర్తితో మోహన్బాబు రాజకీయాల్లోకి వచ్చారు. టిడిపి తరపున మోహన్బాబు ఎంపిగా ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత టిడిపికి దూరమయ్యారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆ కుటుంబంంతో బంధుత్వం ఏర్పడింది. రాజకీయాలకు మోహన్బాబు కొంత దూరంగా ఉన్నట్టు కన్పిస్తోంది.
టిడిపిలోనే మురళీమోహన్
టిడిపిలోనే మురళీమోహన్ కొనసాగుతున్నారు. నాడు ఎన్టీఆర్ వెంట ప్రచారంలో పాల్గొన్నారు. 2009 ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో మరోసారి టిడిపి అభ్యర్థిగా రాజమండ్రి నుండి బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రస్తుతం టిడిపిలోనే మురళీమోహన్ క్రియాశీలకంగా ఉన్నారు.
బిజెపిలో చేరిన కోట శ్రీనివాసరావు
హస్య నటుడుగా, విలన్గా విలక్షణ పాత్రల్లో నటించిన కోట శ్రీనివాసరావు బిజెపిలో చేరారు. 1999 ఎన్నికలకు ముందు ఆయన బిజెపిలో చేరారు. 1999 ఎన్నికల్లో విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థానం నుండి కోట శ్రీనివాసరావు బిజెపి అభ్యర్థిగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
మంత్రిగా పనిచేసిన బాబుమోహన్
మెదక్ జిల్లాలో ఆంధోల్ నియోజకవర్గం నుండి బాబుమోహన్ పలు దఫాలు విజయం సాధించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టిడిపి తరపున ఈ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో మంత్రిగా కూడ పనిచేశారు బాబుమోహన్. 2014 ఎన్నికలకు ముందు బాబుమోహన్ టిడిపి నుండి టిఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ఆంథోల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
టిఆర్ఎస్ లో కీలకపాత్ర పోషించిన విజయశాంతి
విజయశాంతి టిఆర్ఎస్లో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆమె టిఆర్ఎస్లో కీలకంగా పనిచేశారు. 1998లో బిజెపిలో ఆమె చేరారు. అయితే బిజెపిలో ఎక్కువ కాలం కొనసాగలేదు. 2009 విజయశాంతి మెదక్ నుండి ఎంపిగా విజయం సాధించారు. 2011లో టిఆర్ఎస్కు దూరమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె 2014లో మెదక్ నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం మరోసారి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సిద్దమయ్యారు.
కాంగ్రెస్, టిడిపిల్లో జయసుధ
సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జయసుధ విజయం సాధించారు.2014 ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఆరు మాసాల క్రితం ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిశారు. టిడిపిలో చేరారు. ప్రస్తుతం జయసుధ టిడిపిలో కొనసాగుతున్నారు.
కేంద్రమంత్రిగా పనిచేసిన దాసరి నారాయణరావు
కేంద్రమంత్రిగా దాసరి నారాయణరావు పనిచేశారు. దాసరి కూడ గతంలో ఓ పార్టీని పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొనసాగే సమయంలో దాసరి నారాయణరావు నిర్మించిన కొన్ని విప్లవ సినిమాలు నిర్మించారు. ఈ సినిమాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి.
టిడిపిలో రామానాయుడు
టిడిపిలో రామానాయుడు కొంతకాలం పాటు క్రియాశీలకంగా వ్యవహరించారు. గుంటూరు జిల్లా నుండి ఎంపీగా టిడిపి అభ్యర్థిగా ప్రాతినిథ్యం వహించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎంపీగా పనిచేశారు.
టిడిపి , వైసీపీల్లో రోజా
రాజకీయాల్లో టిడిపి ద్వారా రోజా రాజకీయ ప్రవేశం చేశారు. 2009 ఎన్నికలకు ముందు ఆమె టిడిపికి దూరమయ్యారు. ఆ తర్వాత ఆమె వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆమె నగరి నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
హిందూపురం నుండి బాలయ్య
హిందూపురం నుండి బాలయ్య ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇదే స్థానం నుండి గతంలో ఎన్టీఆర్, బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ ప్రాతినిథ్యం వహించారు. 2014 నుండి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.