తెలుగు సీఎంలకు వణుకు, అదే భయం: మోడీ ముందు నిలులేరన్న జీవీఎల్
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్లపై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారం చేపట్టే సత్తా బీజేపీకి ఉందని అన్నారు.
ప్రజల్లో చైతన్యం కలిగిస్తే తాము అధికారంలోకి వచ్చే పరిస్థితులు రావడానికి ఏడాది కాలం సరిపోతుందని జీవీఎల్ అన్నారు. త్రిపుర రాష్ట్రంలో తాము చేసి చూపించింది తెలంగాణలో కూడా సాధ్యం చేయగలమని అన్నారు.
భయంతో ఉన్నవారితోనే కూటమి
ఈ భయంతోనే ప్రధాని నరేంద్ర మోడీపై బురదజల్లే రాజకీయాలకు టీఆర్ఎస్, టీడీపీ నేతలు తెరతీశారని జీవీఎల్ మండిపడ్డారు. తెలంగాణలో తమ బలం తగ్గుతోందని తెలియడం కేసీఆర్లో భయం పట్టుకుందని, అదే భయంతో ఉన్న ఇతర రాష్ట్రాల నేతలను కూడగట్టుకుని ఫ్రంట్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని జీవీఎల్ నర్సింహారావు ఎద్దేవా చేశారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలకు అదే భయం
2014లో ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్పుడు 21రాష్ట్రాలను కైవసం చేసుకుందని అన్నారు. ప్రధాని మోడీకి ఆదరణ పెరుగుతోందని, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అదే భయం పట్టుకుందని జీవీఎల్ అన్నారు.
కేసీఆర్ కుటుంబమే బంగారమైంది..
బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ అంటున్నారని, అయితే, ఆయన కుటుంబం బంగారం కావడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఎలాగైనా ప్రజల దృష్టిని మరల్చేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా నిధులివ్వలేదనే ప్రచారం ఇందులో భాగమనేనని అన్నారు. మోడీ హయాంలో రూ.9.13లక్షల కోట్ల నిధులు దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చామని చెప్పారు.
మోడీ ముందు ఏ ఫ్రంటూ నిలవదు
అయితే, అలాంటి ఏ ఫ్రంట్ కూడా మోడీ ముందు నిలవబోదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్యను మరింత పెంచుకుంటుందని జీవీఎల్ జోస్యం చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈసారి ఎక్కువ సంఖ్యలో సీట్లు సాధిస్తామని, ఆ సంఖ్య 40-50సీట్ల వరకు ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు.
మోడీని తిట్టడమే సింగిల్ ఏజెండానా?
కాంగ్రెస్ హామీలతోనే కాలం వెళ్లదీసిందని.. బీజేపీ మాత్రం అసలు సామాజిక న్యాయం అమలు చేస్తోందని జీవీఎల్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న సీపీఎం జాతీయ సమావేశాలు ప్రధాని మోడీని దూషించటంతో మొదలయ్యాయి, అదే రకంగా ముగించే అవకాశం ఉందన్నారు. మోడీని తిట్టడమే అన్ని పార్టీలకూ సింగిల్ ఎజెండాగా మారిపోయిందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరితో పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు.