అపెక్స్ కౌన్సిల్: భాషా పరమైన సమస్య, ఇద్దరు చంద్రులు ఎలా అధిగమించారు?
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదంపై చర్చించేందుకు గత వారంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భాష సమస్యను ఎదుర్కొన్నారని తెలుస్తోంది.
కేంద్ర మంత్రి ఉమాభారతికి ఇంగ్లీషు రాదు. రాదంటే రాదని కాదు అర్ధం అవుతుంది కానీ ఆమె తిరిగి మాట్లాడలేదు. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కేసీఆర్కు హిందీ వస్తుంది, కానీ చంద్రబాబుకు హిందీ అర్ధం అవుతుంది కానీ మాట్లాడలేరు. అయినప్పటికీ, ఈ భేటీలో వారు భాషా పరమైన సమస్యను ఎలా అధిగమించారు?
ప్రాజెక్టులకు అనుమతులు లేవు
వివరాల్లోకి వెళితే.. కృష్ణానది ఎగువ ప్రాంతంలో శ్రీశైలం రిజర్వాయర్ పైభాగాన తెలంగాణ ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే ఈ ప్రాజెక్టులకు అనుమతులు లేవంటూ కృష్ణాజిల్లా బాపులపాడు డిస్ర్టిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణతో పాటు మరో 11 మంది సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేంద్ర జలసంఘం "తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఎటువంటి అనుమతులు లేవని'' అఫిడవిట్ దాఖలు చేసింది.
అపెక్స్ కౌన్సిన్ ఏర్పాటు
దీని ఫలితంగా కోర్టు అపెక్స్ కౌన్సిన్ ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాలతో మాట్లాడాలని జలవనరుల సంఘాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో జలవనరుల శాఖ ఈ నెల 21న కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగురాష్ర్టాల సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్లతో పాటు రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా, హరీశ్రావు, కార్యదర్శులు శశిభూషణ్ కుమార్, ఎస్.కె.జోషీ, ఇంజినీరింగ్ ఛీఫ్లు తదితరులు హాజరయ్యారు.
ఇంగ్లీషు రాని ఉమాభారతి
ఈ సమావేశ ప్రారంభంలో హిందీలో మాట్లాడిన ఉమాభారతికి ఇంగ్లీషు రాదని ఇరు రాష్ర్టాల సీఎంలకు, అధికారులకు తెలిసిపోయింది. ఉమాభారత తర్వాత సీఎంలు మాట్లాడే సమయం వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్కు హిందీ వచ్చు కాబట్టి హిందీతో పాటు ఇంగ్లీషు కలగలిపి పాల్గొన్న అధికారులకు, కేంద్రమంత్రి ఉమాభారతికి అర్ధమయ్యే రీతిలో చెప్పారు. ఇక చంద్రబాబు వంతు వచ్చింది. చంద్రబాబుకు హిందీ అర్ధమవుతుందిగానీ తిరిగి మాట్లాడలేని పరిస్థితి. దీంతో ఆయన చేసేదేమీ లేక ఇంగ్లీషులో తన వాదనను వినిపించారు.
అర్ధమయ్యే రీతిలో చంద్రబాబు పవర్పాయింట్ ప్రైజెంటేషన్
అయితే తన వాదన మొత్తం ఇంగ్లీషు రాని ఉమాభారతికి అర్ధం అవుతుందా? లేదా అన్న సందేహం వచ్చిన చంద్రబాబు ఆమెకు అర్ధమయ్యే రీతిలో పవర్పాయింట్ ప్రైజెంటేషన్ను హిందీ, ఇంగ్లీష్లలో కలగలిపి చెప్పించారు. దీంతో తాను చెప్పిన వాదన మొత్తం ఉమాభారతికి అర్ధం అయి ఉంటుందని చంద్రబాబుతో సహా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ భేటీ ముగిసిన అనంతరం కేంద్ర జలవనరుల శాఖ అధికారులు "ఉమాభారతికి ఇంగ్లీష్ అర్ధమవుతుంది కానీ, మాట్లాడలేరు'' అని చెప్పడంతో ఇరు రాష్ట్రాల అధికారులు కంగుతిన్నారు.