పోతే పో, ఉంటే ఉండు!: రేవంత్కు 'బిగ్' షాక్, ఇదీ బాబు ప్లాన్, దూళిపాళ్ల సంధి ప్రయత్నం విఫలం
తెలంగాణ టిడిపి నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ టిడిపి నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
చదవండి: కొన్ని తప్పులు చేశారు: రేవంత్ రెడ్డి ప్రశ్నలకు ఇలా ధీటైన కౌంటర్లు
శుక్రవారమే రేవంత్ రెడ్డిపై వేటు వేస్తారని తెలంగాణ టిడిపి నేతలు భావించారు. కానీ అది జరగలేదు. దీంతో చంద్రబాబు ఆయనపై ఆచితూచి వ్యవహరిస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ బాబు ఆలోచన మరోలా ఉందంటున్నారు.
చదవండి: ఏది దూకుడు: రేవంత్ ఇష్యూలో చంద్రబాబు వెనకడుగు? కీలక వ్యాఖ్యలు
చంద్రబాబుది పెద్ద ప్లాన్
రేవంత్ రెడ్డి పైన చంద్రబాబు మంచి వ్యూహాంతో ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది. తెలంగాణలో టిడిపి అంటే రేవంత్, రేవంత్ అంటే టిడిపి అన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పక్కా ప్లాన్తో వ్యవహారాన్ని సాగదీస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
రేవంత్ రెడ్డే వెళ్లిపోవాలి, బాబు మాత్రం సస్పెండ్ చేయరు
పార్టీ నుంచి రేవంత్ రెడ్డే స్వయంగా వెళ్లిపోవాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. చంద్రబాబు మాత్రం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించరని తెలుస్తోంది. పార్టీలో ఉండాలా.. వద్దా అనేది ఆయన విషయానికి వదిలేయనున్నారని తెలుస్తోంది. రేపు అమరావతిలోను భేటీ జరిగినా రేవంత్ విషయంలో ఏం నిర్ణయం తీసుకోకపోవచ్చునని, పార్టీలో ఉండాలా లేదా అనేది ఆయనే నిర్ణయించుకోవాలని బాబు చూస్తున్నారని తెలుస్తోంది. ఉంటే ప్రాధాన్యత ఉండదని, కార్యకర్తలా ఉండే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఆయనే వెళ్లిపోతారని భావిస్తున్నారు.
బాబు ఆగ్రహం, పదవుల నుంచి తొలగించాం, రేవంత్ను మేం ఎందుకు బహిష్కరించాలి
రేవంత్ రెడ్డి తీరుపై చంద్రబాబు బాగానే కోపంగా ఉన్నారని తెలుస్తోంది. బయట ప్రచారం సాగుతున్నట్లుగా ఆయన విషయంలో ఆచితూచి వ్యవహరించడం కాదని, వ్యూహాత్మకంగా పదవుల నుంచి తొలగించారని చెబుతున్నారు. అంటే పార్టీలో కార్యకర్తగా.. ఓ నేతగా మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. 'రేవంత్ రెడ్డిని మేం ఎందుకు పార్టీ నుంచి సస్పండ్ చేయాలి. ఆయన తీరు నేపథ్యంలో రెండు పదవుల నుంచి తొలగించాం. ఆయన పార్టీలో ఉండాలనుకుంటే, పదవులు తిరిగి కావాలనుకుంటే చంద్రబాబు సంతృప్తి చెందేలా వివరణ ఇవ్వాలి. మాకు తెలిసినంత వరకు రేవంత్ స్వయంగా రాజీనామా చేసి వెళ్తే వెళ్లవచ్చు. ఆయన కొద్ది రోజుల్లో తనంత తాను రాజీనామా చేసి వెళ్లవచ్చు' అని ఓ నేత వార్తాసంస్థతో చెప్పారని తెలుస్తోంది.
చంద్రబాబుకు అక్కడ మరీ ఆగ్రహం తెప్పించింది
రేవంత్ రెడ్డి విషయంలో చంద్రబాబుకు మరీ కోపం తెప్పించింది ఏపీ టీడీపీ నేతలను లాగడం అని తెలుస్తోంది. పరిటాల సునీత, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్ల పేర్లను లాగడంపై బాబు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది.
రేవంత్ విజ్ఞప్తితో విజయవాడకు
విదేశాల నుంచి తిరిగి వచ్చిన చంద్రబాబు శుక్రవారం ఉదయం హైదరాబాదులో తెలంగాణ టిడిపి నేతలతో భేటీ అయిన విషం తెలిసిందే. పలువురు నేతలు రేవంత్ పైన ఫిర్యాదు చేశారు. కొందరు ఆయనకు అండగా నిలబడ్డారని తెలుస్తోంది. రేవంత్ను పదవుల నుంచి ఎల్ రమణ తొలగింపుపై చంద్రబాబు మాట్లాడుతూ.. తన పని తాను చేశారని చెప్పారని సమాచారం. ఆ తర్వాత వచ్చిన రేవంత్.. తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని చెప్పారు. మరికొందరు నేతలు కూడా వన్ టు వన్ మాట్లాడాలని కోరారు. దీంతో ఇప్పుడు సమయం లేదని శనివారం అమరావతి వస్తే మాట్లాడుదామని చెప్పారని తెలుస్తోంది.
చంద్రబాబును కలిశాక మాట్లాడుతా
శుక్రవారం చంద్రబాబు వద్దకు వచ్చిన రేవంత్ రెడ్డిని మీడియా పలకరించేందుకు ప్రయత్నించింది. అయితే రేవంత్ మాట్లాడేందుకు నిరాకరించారు. తొలుత తాను చంద్రబాబుతో మాట్లాడుతానని, తన స్టాండ్ చెబుతానని, ఆ తర్వాతే బయట మాట్లాడుతానని చెప్పారు.
సంధి కుదిర్చే ప్రయత్నం చేసిన దూళిపాళ్ల
రేవంత్ రెడ్డి, దూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, వేం నరేందర్ రెడ్డిలు మంచి స్నేహితులు. కానీ ఇప్పుడు రేవంత్ - పయ్యావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. వీరి మధ్య సంధి కుదిర్చేందుకు విదేశాల్లో ఉన్న దూళిపాళ్ల నరేంద్ర ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. కానీ ఇప్పటికే రేవంత్, పయ్యావుల మధ్య సంధి స్థాయి దాటిపోయిందని తెలుస్తోంది. దీంతో దూళిపాళ్ల చెప్పినప్పటికీ వారు తగ్గలేదని సమాచారం.
రేవంత్, పయ్యావుల మధ్య మాటల యుద్ధం
ఇటీవల రేవంత్ మాట్లాడుతూ.. పయ్యావుల మేనల్లుడికి తెలంగాణలో బీరు ఫ్యాక్టరీకి అనుమతులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. దానిపై పయ్యావుల కూడా ఘాటుగానే స్పందించారు. తన మేనల్లుడుకి బార్కు అనుమతి వచ్చిందని, అందరికీ ఇచ్చినట్లే అతనికి ఇచ్చారని, అందులో తనకు సంబంధం లేదని పయ్యావుల అన్నారు. అంతేకాదు, ఆర్నెల్లుగా రేవంత్ ఢిల్లీలో ఎవరెవరితో మాట్లాడుతున్నారో తనకు తెలుసునని, కవితతో కలిసి ఓ కంపెనీని రిజిస్టర్ చేశారని కూడా ధ్వజమెత్తారు. దీంతో ఇరువురి మధ్య సంధి కుదిర్చే స్థాయి దాటిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.