భౌగోళిక విభజనే, తెలుగుజాతిని కలుపుతాం: చంద్రబాబు, తెరాసకు చురకలు
హైదరాబాద్: హైదరాబాద్ ప్రజలు బిజెపి, టిడిపి కూటమి వైపే ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానని, ఆ అభివృద్ధి ఫలితాలనే నేడు అనుభవిస్తున్నారని ఆయన శనివారంనాడు మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి తాను బిల్ క్లింటన్, అబ్దుల్ కలామ్ తదితరులను ఎలా కలిసింది ఆయన సుదీర్ఘంగా వివరించారు. తాము గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 14 శాసనసభ సీట్లు, రెండు పార్లమెంటు సీట్లు గెలిచామని, టిడిపిపై ప్రజలు అచంచల విశ్వాసంతో ఉన్నారని ఆయన చెప్పారు.
తాను ముందుచూపుతో ఐటిని అభివృద్ధి చేశానని ఆయన చెప్పారు. ఐటి అభివృద్ధి వల్లనే భారీ మార్పులు వచ్చాయని, సైబరాబాద్ను తాను నిర్మించడానికి ఎంతో కృషి చేశానని, అమెరికాలో తాను కాలికి బలపం కట్టుకుని చాలా కంపెనీలు తిరిగానని ఆయన చెప్పారు. హైదరాబాద్ను ప్రపంచపటంపై నిలపడానికి సైబరాబాద్ను నిర్మించినట్లు తెలిపారు.
హైటెక్ సిటీ నేడు ఎకనమిక్ మాన్యుమెంట్గా నిలిచిందని చంద్రబాబు చెప్పారు. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ దశ మారిందని అన్నారు. ఐదు వేల ఎకరాలతో శంషాబాద్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు తామే శ్రీకారం చుట్టామని ఆయన అన్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో తాను రావడానికి ముందు అభివృద్ధి జరగలేదని ఆయన చెప్పారు.
హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ రావడంతోనే ప్రపంచంలోని ఐటి కంపెనీల దృష్టి పడిందని ఆయన చెప్పారు. బిల్ గేట్స్ను హైదరాబాద్ రప్పించి అందుకు తాను కృషి చేసినట్లు ఆయన తెలిపారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టును ఎన్టీ రామావు తెచ్చారని, లుంబినీ పార్కు పెట్టామని ఆయన చెప్పారు. కొంత మంది పార్టీని వీడినా తమకేమి నష్టం లేదని ఆయన చెప్పారు.
హైదరాబాద్ తన మానసపుత్రిక అని, ఇరు ప్రాంతాలను కలుపుకుని తాము ముందుకు సాగుతామని ఆయన అన్నారు. భౌగోళిక విభజన మాత్రమే జరిగిందని, మనుషులను విభజించలేరని ఆయన అన్నారు. తెలుగుజాతిని కలిపే శక్తి టిడిపికి మాత్రమే ఉందని ఆయన అన్నారు. తెలుగు జాతి ఎక్కడ ఉంటే టిడిపి అక్కడ ఉంటుందని ఆయన అన్నారు.
తాను హైదరాబాదులోనే ఉంటానని, ఎక్కడైనా సమస్య ఉంటే అరగంటలో వస్తానని ఆయన చెప్పారు. టిడిపి, బిజెపి విజయం చారిత్రక అవసరమని చెప్పారు. హైదరాబాదులో మతసామరస్యాన్ని కాపాడామని చంద్రబాబు చెప్పారు. పనిలో పనిగా ఆయన తెరాస ప్రభుత్వానికి చురకలు అంటించారు. తాము 15 నెలల్లో హైటెక్ సిటీ కడితే 15 నెలల్లో డ్రైనేజీ కూడా నిర్మించలేకపోయారని ఆయన అన్నారు. రెండో విడత వరంగల్కు స్మార్ట్ సిటీ హోదా వస్తుందని చెప్పారు .