డ్రగ్స్ కేసులో ట్విస్ట్: సీఎం కేసీఆర్కు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లేఖ... ఎందుకో?
డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు తెలుగు సినిమా పరిశ్రమ ఓ లేఖ రాసింది. సినీ పరిశ్రమపై ఆధారపడిన వేలాది కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ఈ కేసులో దర్యాప్తును హుందాగా నిర్వహించాలని కోరింది.
హైదరాబాద్: డ్రగ్స్ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ను తెలుగు సినిమా పరిశ్రమ కోరింది. డ్రగ్స్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది.
ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొంది. డ్రగ్స్ కేసు ప్రభావం వేలాది కుటుంబాలపై పడనుందని, సినిమా పరిశ్రమ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని హుందాగా దర్యాప్తు సాగించాలని కోరుకుంటున్నామని తెలిపింది.
కేసు దర్యాప్తులో తమ వంతు సహకారం అందిస్తామని సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో తెలుగు సినిమా పరిశ్రమ హామీ ఇచ్చింది. సమాజం, మీడియా నుంచి తాము సానుభూతి కోరుకుంటున్నామని వెల్లడించింది.
డ్రగ్స్ కేసు విచారణ జరిగిన 10 రోజులు ఇండస్ట్రీకి చీకటిరోజులుగా అభివర్ణించింది. డగ్స్ వాడిన వారిపై తామే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. డ్రగ్స్ వ్యవహారం తమందరికీ ఓ కుదుపు, ఓ హెచ్చరిక అని తెలుగు సినిమా పరిశ్రమ పేర్కొంది.