అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరి.. సీఎం కేసీఆర్ ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రావాలని తెలిపారు. తమిళనాడులో మాతృభాషలో బోధనా విధానాన్ని అధ్యయనం చేసి వచ్చిన అధికారులతో మంగళవారం కేసీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై రూపొందించాల్సిన విధివిధానాలపై అధికారులతో చర్చించారు. మాతృభాషను బతికించుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటామని గత డిసెంబర్లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం ప్రకటించారు.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా అధికారులకు కేసీఆర్ సూచించారు. ప్రైవేట్ స్కూళ్లలో తప్పనిసరిగా తెలుగు పండితుడు ఉండాలని పేర్కొన్నారు. దీనిపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.
ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా తెలుగు భాష నేర్చుకోవాలనే నిబంధన పెడుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మొదటి దశలో పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే తెలుగు సబ్జెక్ట్కు సిలబస్ రూపొందించాలని తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య అకాడమీని కోరారు. సిలబస్లో నైతిక విలువలు, దేశభక్తి పెంపు అంశాలు ఉండాలని ఆయన సూచించారు.