ఇక తెలుగులో ఔషధాలు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించే మందులపై ముద్రణ
వరంగల్: ప్రాణాలు కాపాడే ఔషధాల నుంచి సాధారణ వ్యాధులకు వాడే మందుల వరకు ఇకపై అన్నింటి పేర్లను తెలుగులోనే ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆంగ్లంలోనే ముద్రితమై ఉన్న ఔషధాల పేర్లు ఇకపై తెలుగులోనే చదువుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అందించే ఔషధాలపై ఆంగ్లంలోనే వాటి పేర్లు ఉండేవి.
డిగ్రీలు, పీజీలు చదివినవారికి సైతం అది ఏ మందు అనేది తెలిసేది కాదు. ఈ కారణంగా చదువుకున్న వారితోపాటు ఆంగ్లంరాని వారు సైతం వైద్యుడిచ్చిందే సరైన మందు అని తీసుకునే వారు. కొన్ని సందర్భాల్లో ఆయా మందులను వైద్యులు వైద్య సిబ్బందికి చూపించి వారితో ఆమోదముద్ర వేయించుకుని వాడేవారు. ఇప్పుడు ఈ తతంతమంతా మారింది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న మందుల పెట్టెలు, డబ్బాలపై తెలుగులోనే ఆ మందుల పేర్లను ముద్రిస్తున్నారు. మార్చి నెల నుంచి ఈ కొత్త రకం మందులు ఆసుపత్రులలో అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఐడీసీ) ద్వారానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మందులు, యంత్రాలు, సర్జికల్ వస్తువులు సరఫరా అవుతాయి.
గతంలో టెండర్ పొందినవారు తమ కిష్టమొచ్చిన రీతిన మందులను సరఫరా చేశారు. దీంతో నాసిరకం మందుల, వాయిల్స్, ఆర్ఎల్ ద్రవం వంటివి విచ్చలవిడిగా ఆస్పత్రులు, పీహెచ్సీలకు చేరిపోయేవి. ఈ కారణంగా రోగుల ప్రాణాల మీదకు వచ్చి ప్రభుత్వ పరువు బజారు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అమలుచేస్తున్నట్లు వైద్య ఆరోగ్య సేవలు, పథకాల పరిశీలనకు ప్రభుత్వం ఆరుగురు ఔషధ నియంత్రణ అధికారులతో కూడిన బృందాన్ని అక్కడకు పంపించింది. వారు అందించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం కొత్తగా టెండర్ల విధానంలో మార్పులు చేసింది.