పవన్ కళ్యాణ్పై స్ట్రింగ్ ఆపరేషన్..బెడిసి కొట్టిన వ్యూహం, ధీటుగా జవాబు ఇచ్చిన జనసేన
హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సమావేశాన్ని స్ట్రింగ్ ఆపరేషన్ అంటూ పేర్కొంటూ ఓ ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్ హడావుడి చేసింది. సోషల్ మీడియాలో ఆ ఛానెల్ను జనసేన కార్యకర్తలు, ఇతర నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. జర్నలిజం విలువలను ఆ ఛానెల్ యాజమాన్యం కాలరాస్తోందని నెటిజెన్లు మండిపడ్డారు. జనసేన అధినేత ఏర్పాటు చేసిన సమావేశం రహస్య సమావేశంగా పేర్కొంటూ తాము స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి ... ఆ పార్టీ డబ్బులు వసూలు చేస్తున్న దృశ్యాలను టెలికాస్ట్ చేస్తున్నామంటూ తెగ హడావుడి చేసింది. అయితే అది రహస్య మీటింగ్ కాదని.. పార్టీకోసం విరాళాలు మాత్రమే సేకరిస్తున్నట్లు జనసేన వర్గాలు క్లారిటీ ఇవ్వడంతో ... ఛానెల్ రిపోర్టర్ అందులో వ్యాఖ్యాతగా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్టుపై ఛానెల్ యాజమాన్యం సీరియస్ అయినట్లు సమాచారం.
రహస్య భేటీ అంటూ కథనాలు
ఛానెల్ ప్రసారం చేసిన కథనం ప్రకారం... పవన్ కళ్యాణ్ ఒక సామాజిక వర్గానికి చెందిన వారితో రహస్య సమావేశం ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని వ్యాఖ్యాత తన లైవ్ ప్రోగ్రాంలో తెలిపారు. ఆ దృశ్యాలు మీకోసం టెలికాస్ట్ చేస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు అక్కడే ఉన్న రిపోర్టర్ను కూడా లైవ్లోకి తీసుకుని అతనితో బురదజల్లించే ప్రయత్నం చేశాడు. పవన్ కళ్యాణ్ ఆడిటర్ రత్నం డబ్బులు వసూలు చేస్తున్నాడంటూ ఆ రిపోర్టర్ తెలిపాడు. డబ్బులను క్యాష్ రూపమా లేదా చెక్ రూపంలో ఇస్తున్నారా అనే మాటలు ఆ వీడియోలో వినిపిస్తున్నాయంటూ రిపోర్టర్ తెలిపాడు. ప్రతి ఒక్కరు రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనంటూ జనసేన అధినేత ఆదేశాలు జారీ చేశారని ఆ కథనంలో వండి వార్చారు.
అయితే సదరు జర్నలిస్టు చెప్పినట్లుగా ఇది రహస్య సమావేశం కాదని ... 99టీవీలో ఈ సమావేశానికి సంబంధించి కొద్దిరోజులుగా ప్రకటనలు ఇస్తున్నామని జనసేన వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి అభిమానులు కూడా వెళ్లారని... జనసేనానితో ఫోటోలు కూడా దిగారని స్పష్టం చేసింది. ఈ ఫోటోల్లో ఛానెల్ రిపోర్టర్ కూడా వెనక నిల్చుని ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి అదే రిపోర్టర్ స్ట్రింగ్ ఆపరేషన్ అంటూ కొత్త కథను అల్లడంపై ప్రేక్షకులు సదరు ఛానెల్ను దుమ్మెత్తి పోస్తున్నారు.
అన్ని పార్టీల్లానే జనసేన కూడా విరాళాలు సేకరిస్తోందన్న రిపోర్టర్
అంతకుముందే అంటే సమావేశం సందర్భంగా మరో రిపోర్టర్ మాత్రం అక్కడ పవన్ పలు సామాజిక వర్గాలతో హోటల్లో బేటీ అయ్యారని... అన్ని పార్టీల్లానే జనసేన పార్టీ కూడా విరాళాలు మాత్రమే సేకరిస్తోందంటూ రిపోర్టింగ్ ఇచ్చాడు. స్టూడియోలో కూర్చొన్న సదరు సీనియర్ జర్నలిస్టు ఆ ఛానెల్ సీఈఓ మాత్రం ఇది స్టింగ్ ఆపరేషన్ అని చెబుతుంటే... రిపోర్టర్ మాత్రం పవన్ కళ్యాణ్ అందరితో భేటీ అవుతున్నారని స్పష్టంగా చెప్పాడు. సబ్జెక్టుపై అవగాహన ఉన్నవారు ఆడిటర్ సమక్షంలో పార్టీ యాక్టివిటీస్ కోసం విరాళాలు సేకరిస్తే తప్పేముందంటూ ప్రశ్నిస్తున్నారు.
ఛానెల్కు గుడ్బై చెప్పిన సీనియర్ జర్నలిస్టు..?
ఏదో చేయాలని చూసి మరేదో చూపించాలని ప్రయత్నించి మొత్తానికి ఆ ఛానెల్ నవ్వుల పాలైంది. దీంతో ఆగ్రహం చెందిన ఛానెల్ ఎండీ సదరు సీఈఓ సీనియర్ జర్నలిస్టును ప్రశ్నించగా... అతని ఈగో దెబ్బతిన్నట్లు సమాచారం. ఇద్దరి మధ్య ఒక్కింత వాగ్వాదం చోటుచేసుకుందని ఛానెల్లో పనిచేసే ఇతర ఉద్యోగులు చెవులు కొరుక్కున్నారు. ఇక చెప్పేది ఏమి లేదంటూ ఆ సీనియర్ జర్నలిస్టు తాను ఛానెల్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారట.
రహస్య భేటీలు పెట్టాల్సిన అవసరం మాకేంటి
ఈ మొత్తం ఎపిసోడ్పై జనసేన కార్యకర్త కళ్యాణ్ దిలీప్ సుంకర సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అక్కడ రహస్య భేటీ పెట్టాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ఆడియోలో చెక్ అనే పదం వినిపిస్తోందని... డబ్బులే వసూలు చేయాలంటే చెక్ రూపంలో ఇస్తారా అని ఆడిటర్ రత్నం ఎందుకు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. కేవలం టీఆర్పీల కోసమే సీనియర్ జర్నలిస్టు పాకులాడుతున్నాడని ...విషయంపై అవగాహన లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసి జర్నలిస్టు వృత్తిని కళంకితం చేయొద్దని మండిపడ్డారు.