ఎన్నారై సంబంధం.. ఎనిమిదేళ్లలో కడతేర్చింది!
హైదరాబాద్: కోట్ల రూపాయల మేర ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ.. వరకట్న వేధింపులు ఆ మహిళను బలి తీసుకున్నాయి. అదనపు కట్నం కోసం అత్తింటివాళ్ల వేధింపులను భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డారు ఆ ఇల్లాలు. పెళ్లయిన ఎనిమిదేళ్లలోనే ఆత్మహత్యకు చేసుకున్నారు. మృతురాలి పేరు జువ్వాడి శ్రీలత. హైదరాబాద్ రామాంతాపూర్లో నివాసం ఉండేవారు. అదనపు కట్నం కోసం అత్తామామల వేధింపులను భరించలేక ముంబైలోని మేనమామ ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు.
2011లో జువ్వాడి శ్రీలతకు రామాంతపూర్కు చెందిన వంశీ రావుతో వివాహమైంది. ఉన్నత విద్యావంతుడైన వంశీరావు బ్రిటన్లో సాఫ్ట్వేర్ సంస్థలు ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయిన ఏడాది తరువాత అతను శ్రీలతను కూడా బ్రిటన్కు తీసుకెళ్లాడు. ఆ దంపతులకు ఆడపిల్ల జన్మించింది. తొలి చూలులోనే ఆడపిల్ల పుట్టడాన్ని భరించలేకపోయారు శ్రీలత అత్తామామలు. ఆడ పిల్ల పుట్టినప్పటి నుంచి వారు అదనపు కట్నం కోసం వేధించ సాగారు. తాము అడిగినంత కట్నాన్ని ఇచ్చి పెళ్లి చేసినప్పటికీ.. ఆడపిల్ల పుట్టడాన్ని సాకుగా చూపుతూ అదనపు కట్నం కోసం వేధింపులు మొదలు పెట్టారు. తన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో శ్రీలత వారిని ఇబ్బందులకు గురి చేయలేకపోయారు. అత్తామామల వేధింపులను మౌనంగా భరించారు. అత్తవారింట్లో తన కుమార్తె పడుతున్న బాధలను శ్రీలత తల్లి చంద్రకళ మనోవేదనకు గురై 2016లో మరణించారు.
అయినప్పటికీ- శ్రీలతకు వేధింపులు ఆగలేదు. దీనితో ఆమె గత ఏడాది లండన్లో ఆత్మహత్యకు ప్రయత్నించారు. రైలుకింద పడి చనిపోవడానికి విశ్రప్రయత్నలు చేశారు. అదే ఏడాది జూన్లో వంశీరావు తన భార్య శ్రీలత, కుమార్తెను లండన్ను తీసుకొచ్చాడు. రామంతపూర్లో తన తల్లిదండ్రుల వద్ద వదిలి పెట్టి, ఒంటరిగా విమానం ఎక్కేశాడు. అప్పటినుంచి శ్రీలతకు అత్తమామల వేధింపులు మరింత తీవ్రతరం అయ్యాయి.
దీన్ని భరించలేక ఆమె ముంబైలో నివసిస్తోన్న తన మేనమామ ఇంటికి వెళ్లారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతదేహాన్ని మంగళవారం రాత్రి రామంతాపూర్లోని అత్తవారింటికి తీసుకొచ్చారు బంధువులు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న శ్రీలత అత్తమామలు జువ్వాడి రాజేశ్వర్రావు, ఆశాలతలు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీనితో శ్రీలత బంధువులు ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి ఆందోళనకు దిగారు. శ్రీలత మృతికి కారకులైన భర్త, అత్త మామలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరగకపోతే శ్రీలత మృతదేహాన్ని అత్తవారి ఇంట్లో పూడ్చిపెడతామని కుటుంబ సభ్యులు అంటున్నారు.