ప్రయాణించడమంటే తెలుగు ప్రజలకు చెడ్డ చిరాకంట: సర్వే వెల్లడి
హైదరాబాద్: తెలుగు ప్రజలు తమ రాష్ట్రాలను దాటి విహారయాత్రలకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపరట. 2014-15 సంవత్సరానికి గాను నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ నిర్వహించిన ఓ సర్వేలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం తెలుగు ప్రజలు సొంత రాష్ట్రాలను దాటి ట్రిప్, హాలీడేయింగ్లాంటి వాటికి వెళ్లడానికి శ్రద్ధ చూపడం లేదంట.
2014-15లో కేవలం 8.1 శాతం మంది ప్రజలు మాత్రమే ఓవర్ నైట్ ట్రిప్స్, ఆటవిడుపు, హాలీడేయింగ్, షాపింగ్, మెడికల్ అవసరాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లినట్లు పేర్కొంది. కాగా 38 శాతంతో హర్యానాకు చెందిన ప్రజలు ఈ సర్వేలో మొదటి స్థానంలో నిలిచారు. ఆటవిడుపు కోసం ఏపీ నుంచి ఏడాది కాలంలో అత్యధికంగా 1,30,600 యాత్రలు జరిగితే, తెలంగాణ నుంచి 2,02,700 యాత్రలు జరగడం విశేషం.
ఏపీ నుంచి కేవలం 30 రోజుల వ్యవధిలో మత సంబంధిత కార్యక్రమాల కోసం 1,44,200 యాత్రలు, సామాజిక అవసరాల పరంగా 14,08,400 యాత్రలు జరగడం విశేషం. తెలంగాణ నుంచి సామాజిక అవసరాలకు 6,54,000, మత సంబంధిత కార్యక్రమాలకు 53,100 యాత్రలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
మొత్తం దక్షిణ భారతదేశంతో పోల్చి చూస్తే ఆటవిడుపు కోసం విహారయాత్రలకు వెళ్లినవారి సంఖ్యలో అతి తక్కువ సంఖ్య తెలుగువారిదేనని సర్వే పేర్కొంది. అంతేకాదు తెలుగురాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల నుంచి యాత్రలకు వెళ్తున్న వారు అక్కడ ఖర్చు చేస్తున్నది కూడా చాలా తక్కువేనని సర్వేలో తేలింది.
ఏపీ నుంచి సగటున రూ.5,396 అక్కడికి వెళ్లిన వారు ఖర్చు చేశారని, అదే తెలంగాణ నుంచి అయితే రూ.9,777లు ఖర్చు చేశారని సర్వేలో తేలింది. ఆటవిడుపు కోసం ఒంటరిగా విహారయాత్రలకు వెళ్తున్న మహిళల్లో మాత్రం తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానంలో నిలిచాయి.
ఏపీ నుంచి 53శాతం మంది మహిళలు, తెలంగాణ నుంచి 60 శాతం మంది మహిళలు ఒంటరిగా యాత్రలకు వెళ్లారు. 30 రోజుల వ్యవధిలో అత్యధికంగా యాత్రికులను ఆకర్షించిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత తెలుగు రాష్ట్రాలు 8,68,100 మందితో రెండో స్థానంలో నిలిచాయి.