అగ్ని గుండంలా మారుతున్న తెలుగు రాష్ట్రాలు..! ప్రతాపం చూపిస్తున్న భానుడు..!!
అమరావతి/హైదరాబాద్: రోహిణీ కార్తె తన ప్రభావం చూపించడం మొదలు పెట్టింది. తెలుగు రాష్ట్రాలు భానుడి ప్రకోపానికి ప్రజలు అల్లాడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అర్ధరాత్రి దాటినా తగ్గని వేడిగాలులతో నిద్రలేక విలవిల్లాడుతున్నారు. కరెంట్ కు ఎన్నడూ లేనంత డిమాండ్ పెరిగిపోయింది. వాయువ్య దిశ నుంచి వీస్తున్న వడగాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
పలు జిల్లాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. తేమ శాతంలో మార్పుల కారణంగానే నిప్పులగుండంగా రాష్ట్రం మారిందని అధికారులు తెలుపుతున్నారు.మరో మూడు రోజుల పాటు రోహిణి మంటలు కొనసాగుతాయని, ఆపై మరో వారం వరకూ సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, రుతుపవనాలు ప్రవేశించిన తరువాతే సాధారణ స్థాయి నెలకొంటుందని అంచనా వేశారు. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 47డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 120చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరిగినట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
వడగాలులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో భయటకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ఒక వేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే మంచినీరు తమ వెంట తీసుకుపోవాలని, ప్రతి అరగంటకు నీరు సేవించాలని సూచించారు. వడదెబ్బ తగిలితే చల్లని ప్రదేశానికి వెంటనే తీసుకువెళ్లాలని సూచించారు.