డిగ్గీని, జానాని తప్పించండి.. : హైకమాండ్ కి పాల్వాయి ఫిర్యాదు, 'డిగ్గీ స్థానంలో మాజీ సీఎం'
హైదరాబాద్ : ఫిరాయింపులు వరుస ఓటములతో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తులు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాలను చక్కదిద్దుతూ వస్తున్న దిగ్విజయ్ సింగ్ పై పార్టీ నేతల నుంచి పలు ఫిర్యాదులు అందడంతో ఆయన స్థానంలో మరొకరిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంచార్జీగా దిగ్విజయ్ పనితీరుపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేతలు.. ఆయన స్థానంలో వేరొకరిని నియమించాల్సిందిగా గతంలోను కాంగ్రెస్ హైకమాండ్ కి విన్నవించుకున్నారు. కాగా, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి మరోసారి విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఢీలా పడడానికి కారణం దిగ్విజయ్ సింగే అని ఎంపీ పాల్వాయి హైకమాండ్ కి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. పార్టీ మళ్లీ గాడిన పడాలంటే దిగ్విజయ్ ని ఇంఛార్జీ పదవి నుంచి తప్పించాల్సిందేనని ఎంపీ పాల్వాయి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి విన్నవించినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఇంఛార్జీ దిగ్విజయ్ తో పాటు, సీఎల్పీ నేతగా జానారెడ్డిని కూడా తప్పించాలని ఎంపీ పాల్వాయి అధినేత్రి సోనియాకు విజ్ఞప్తి చేశారన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, పార్టీ నేతల నుంచి అందుతున్న ఫిర్యాదుల మేరకు దిగ్విజయ్ ను ఇంఛార్జీ స్థానం నుంచి తప్పించాలని హైకమాండ్ యోచిస్తున్నట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక జానారెడ్డి విషయంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
కాగా.. దిగ్విజయ్ ని తప్పిస్తే ఆ స్థానంలో కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీని నియమించే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఏకే ఆంటోని ఉమెన్ చాందీతో చర్చలు జరిపినట్టుగా సమాచారం. ఉమెన్ చాందీ 'ఓకె' అన్న సంకేతాలు పంపించడమే ఆలస్యం ఇక తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఇంఛార్జీగా ఆయన నియామకం దాదాపుగా ఖాయమనే వాదన వినిపిస్తోంది.