ఎవరి వాదనలు వారివే... జల వివాదాలపై ఇప్పటికైనా పరిష్కారం దొరికేనా... నేడే అపెక్స్ కౌన్సిల్ భేటీ...
తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి మంగళవారం(అక్టోబర్ 6) అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. గోదావరి,కృష్ణా నదులపై ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే పరస్పరం బోర్డులకు ఫిర్యాదు చేసుకున్న రాష్ట్రాలు... కౌన్సిల్ ఎదుట తమ వాదనను బలంగా వినిపించాలని భావిస్తున్నాయి. కౌన్సిల్ ఎజెండాలో ఉండాల్సిన అంశాలపై రెండు రాష్ట్రాలు ఎలాంటి లిఖితపూర్వక లేఖ ఇవ్వలేదు. దీంతో కేంద్ర జల్శక్తి శాఖనే బోర్డుల నుంచి సేకరించిన వివరాలతో నాలుగు అంశాలతో ఎజెండా ఖరారు చేసింది.
Recommended Video
పాల్గొననున్న ఇద్దరు సీఎంలు...
ముందస్తు షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు వెబినార్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగాల్సి ఉంది. అయితే దాన్ని ఒక గంట ముందుకు జరిపారు. ఈ భేటీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెబినార్ ద్వారా పాల్గొంటారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ అక్కడినుంచే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి వెబినార్లో పాల్గొననున్నారు. అలాగే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లు జలసౌధలోని తమ ఛాంబర్ల నుంచి ఇందులో పాల్గొంటారు.
ఎజెండా ఇదే...
బోర్డులు ఏర్పడి ఆరేళ్లు గడిచినా.. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికీ గోదావరి,కృష్ణా నదుల పరిధిని నిర్ణయించకపోవడంతో కేంద్రంపై తీవ్ర విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో తాజా అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో ఆ పరిధిని నోటిఫై చేసే అంశాన్ని ఎజెండాలో చేర్చారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై నిర్ణయంతో పాటు గోదావరి,కృష్ణా నదులపై నిర్మించే కొత్తప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను సంబంధిత యాజమాన్య బోర్డులకు సమర్పించడం, తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా, గోదావరి జలాల పంపిణీకి కార్యాచరణ ప్రణాళిక (మెకానిజం),
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలించడం వంటి అంశాలను ఎజెండాలో చేర్చారు.
కేసీఆర్ అభ్యంతరాలు,డిమాండ్లు...
తెలంగాణకు సంబంధించి చుక్క నీటి బొట్టును కూడా వదులుకునేది లేదని ముందు నుంచి చెప్తున్న సీఎం కేసీఆర్... కౌన్సిల్ ముందు బలమైన వాదనలు వినిపించేందుకు సిద్దమయ్యారు. నదీజలాల వివాద ట్రిబ్యునల్-1956లోని సెక్షన్-3 ప్రకారం ఏడాదిలోనే నీటి వాటాల వివాదాన్ని పరిష్కరించాల్సి ఉండగా... ఆరేండ్లు ఎందుకు సాగదీశారని కేంద్రాన్ని ప్రశ్నించనున్నారు. కృష్ణా జలాల్లో వాటాతో పాటు గోదావరి మిగులు జలాల వాటాను కూడా తేల్చాలని డిమాండ్ చేయనున్నారు. ఏకపక్షంగా చేపడుతున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరనున్నారు. అలాగే పోలవరంలో తెలంగాణ వాటా,తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదులపై సీఎం కేసీఆర్ నిలదీయనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఏపీలోనే చేపట్టినవని... కొత్త ప్రాజెక్టులే చేపట్టనప్పుడు డీపీఆర్లు ఎలా ఇస్తామని ప్రశ్నించనున్నారు.ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల జీవోలు,అనుమతుల వివరాలను కేంద్రానికి తెలియజేయనున్నారు.
అటు అధికారులతో జగన్ చర్చలు...
అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం(అక్టోబర్ 5) రాత్రి ఢిల్లీలో అధికారులతో ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న వాదనకు కౌన్సిల్లో కౌంటర్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఉన్న ప్రాజెక్టులకు నీటి సరఫరా కోసమే తప్పితే... దీని ద్వారా అదనంగా నీటి వినియోగం ఏమీ ఉండదని కౌన్సిల్లో చెప్పనున్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వెసులుబాటు ఉందని... కానీ ఏపీకి అలాంటి అవకాశం లేదని వివరించనున్నట్లు తెలుస్తోంది.
పరిష్కారం దొరికేనా...?
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ తమ తమ వాదనలతో సిద్దమైన నేపథ్యంలో కౌన్సిల్ ఏ అంశంలో ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా గోదావరి,కృష్ణా బోర్డుల పరిధిని నోటిఫై చేసే అవకాశం ఉంది. అయితే నీటి వాటాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల డిమాండ్లు,అభ్యంతరాలపై కౌన్సిల్ ఎలాంటి పరిష్కారం చూపుతుంది.. ఇరువురి మధ్య ఎలా సయోధ్య కుదురుస్తుంది అన్నది వేచి చూడాలి.