నేలరాలిన మరో విద్యా కుసుమం.. కెనడాలో తెలుగు విద్యార్థి మృతి
హైదరాబాద్ : విదేశాల్లో మరో విద్యా కుసుమం నేలరాలింది. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో విద్యార్థి చనిపోయాడు. తిరిగిరానిలోకాలకు వెళ్లి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చాడు. కెనడాలో తెలుగు విద్యార్థి జగన్ మోహన్ రెడ్డి మృతిచెందాడు. తమ కుమారుడు లేరనే వార్త విని జీర్ణించుకోలేపోతున్నారు పేరెంట్స్. మరోవైపు వారి కాలనీ మంఖల్ విషాదంలో మునిగిపోయింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోకి మంఖల్కు చెందిన జగన్ మోహన్ రెడ్డి పై చదువుల కోసం కెనడా వెళ్లాడు. 2012లో హైదరాబాద్ లోని స్పూర్తి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. పై చదువుల కోసం కెనడా వెళ్లి .. చదువుకుంటున్నాడు. ఇంతలోనే ప్రమాదం అతడిని కబళించింది. ఉన్నత చదువులు చదివి .. ఉద్యోగంతో జీవితంలో సెటిల్ అయ్యే సమయంలో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనతో మృతిచెందాడు. అతను లేడనే వార్తను స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కెనడాలోని టోరంటోలో సరస్సులో పడి జగన్ చనిపోయినట్టు తెలుస్తోంది. స్నేహితుల ద్వారా తల్లిదండ్రులకు విషయం తెలిసింది. దీంతో వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. జగన్ లేరనే వార్తతో మంఖల్ శోకసంద్రంలో మునిగిపోయింది. జగన్ మృతదేహన్ని ఇండియా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. వీలైనంత త్వరగా మృతదేహం తరలించాలని బంధువులు కోరుతున్నారు. యువకుడి కుటుంబాన్ని ఆదుకోవాలని మంఖల్ వాసులు విన్నవిస్తున్నారు.