ఐరోపాలోనే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన తెలుగురాష్ట్రాల యువకులు
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు యువకులు ఐరోపాలోనే అతి ఎత్తైన పర్వతం మౌంట్ ఎల్బ్రస్(రష్యా)ను గురువారం విజయవంతంగా అధిరోహించింది. ఈ బృందంలో నలుగురు తెలంగాణ, ఇద్దరు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఉన్నారు.
ఈ ఆరుగురిలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కుర్వగూడకు చెందిన దాదె సునీల్, బలరామ్ రాథోడ్(వికారాబాద్), పత్లావత్ అరుణ్ కుమార్ (నల్గొండ), పాల్తియా శ్రీకుమార్ (నల్గొండ), ఆంధ్రప్రదేశ్కు చెందిన గోసాల్ రాజు (విశాఖపట్నం), షేక్ హిమామ్షా(ఒంగోలు) ఉన్నారు.
సెప్టెంబర్ 7న ఈ ఆరుగురు సభ్యుల బృందం ఢిల్లీ నుంచి మాస్కోకు బయలుదేరారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9.30 గంటలకు 5,642 మీటర్ల ఎత్తయిన పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. అక్కడ భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ విజయకేతనాన్ని చాటారు.
కాగా, -20 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ధైర్యంగా పర్వతం అంచుకు చేరుకున్నారు. సెప్టెంబర్ 17న వారు స్వదేశానికి చేరుకోనున్నారు. తమ స్వగ్రామం కుర్వగూడను అధికారులు లేదా ప్రజాప్రతినిధులు దత్తత తీసుకోవాలంటూ సునీల్ ఈ సందర్భంగా కోరాడు.
ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ సంస్థ అధ్వర్యంలో.. కోచ్లు శేఖర్బాబు, పరమేశ్ కుమార్ పర్యవేక్షణలో ఈ యాత్ర సాగింది. జులై 27న కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 టీంలు ఈ మౌంట్ ఎల్బ్రస్ అధిరోహించడం గమనార్హం.