నిన్న రేవంత్, నేడు ఉమ.. బాబుకు షాక్: పాయింట్ లాగిన 'తనయుడు'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు అనంతరం తెలుగుదేశం పార్టీకి ఓ విధంగా మరో షాక్! గ్యాంగ్ స్టర్ నయీంతో మాజీ మంత్రి, టిడిపి నేత ఉమా మాధవ రెడ్డికి సంబంధాలు ఉన్నాయనే పుకార్లు టిడిపికి మరో దెబ్బ అని అంటున్నారు.
గత ఏడాది ఓటుకు నోటు కేసుతో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో తీవ్ర నష్టం జరిగింది. ఆ కేసు అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలకు పన్నెండు మంది కారు ఎక్కారు. ఆయా జిల్లాల్లోని కీలక నేతలు కూడా అధికార పార్టీలో చేరారు.
ఓటుకు నోటు అనంతరం తెలుగుదేశం పార్టీ క్రమంగా కుదురుకుంటోంది. తెలంగాణ టిడిపి నేతలు రేవంత్ రెడ్డి, ఎల్ రమణ తదితరులు పార్టీ బలోపేతం చేసే అంశంపై దృష్టి సారించారు. ఇలాంటి పరిస్థితిల్లో నయీంతో ఉమా మాధవ రెడ్డికి సంబంధాలు అనేది ఆ పార్టీకి మరో దెబ్బ అంటున్నారు.
కుట్ర కోణం ఉందా?
నయీం కేసులో ఉమా మాధవ రెడ్డి పేరును తెరపైకి తీసుకు రావడం వెనుక కుట్ర కోణం దాగి ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. తన పైన కక్ష సాధింపుతో ఇలా చేస్తున్నారని ఉమా మాధవ రెడ్డి ఆరోపించారు. టిడిపిని దెబ్బతీసేందుకు ఇదో కుట్ర అని అభిప్రాయపడ్డారు.
రేవంత్ రెడ్డి
టిడిపి నేత రేవంత్ రెడ్డి కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. దివంగత మాధవ రెడ్డికి, అలాగే ఉమా మాధవ రెడ్డికి ఎలాంటి నేర చరిత్ర లేదని, వారిపై నిందలు మోపుతున్నారన్నారు.
కొందరిని కాపాడేందుకే..
ఇటీవల మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో కొందరు తెరాసలో చేరారని, వారిని కాపాడేందుకే తమను ఇరికిస్తున్నారని ఉమా మాధవ రెడ్డి తనయుడు సందీప్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కొందరు పెద్దలను, రాజకీయ నాయకులను కాపాడేందుకు తమను లాగారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాయింట్ లాగిన ఉమామాధవ రెడ్డి తనయుడు
తమకు భూదందాలు, హత్యానేరాలు తెలియదవని ఉమా మాధవ రెడ్డి తనయుడు సందీప్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఓ మాట మాట్లాడారు. 2004 వరకు భూదందాలు అనేవి పెద్దగా లేవని, అసలు భూదందాలే లేనప్పుడు తమ పైన ఆరోపణలు ఎలా చేయగలుగుతారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
టిడిపిని దెబ్బతీసే కుట్రనా?
అంతిమంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికే ఉమా మాధవ రెడ్డిని లాగారని ఆమెతో పాటు టిడిపి నేతలు కూడా భావిస్తున్నారు.
రెడ్డి సామాజిక వర్గం టార్గెట్!
తెలంగాణ సీఎం కేసీఆర్ రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉమా మాధవ రెడ్డి.. కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె రెడ్డి సామాజికవర్గం అని స్పష్టంగా చెప్పలేదు. కానీ ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. గతంలో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు, ఆ తర్వాత పలు సందర్భాల్లో కేసీఆర్ ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకున్నారనే ఊహాగానాలు వచ్చాయి.
ఉమామాధవ రెడ్డి తెరాసలో చేరుతారని..
ఉమా మాధవ రెడ్డి తెరాసలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ ఆమె మాత్రం తాను టిడిపిలోనే ఉంటానని చెబుతున్నారు. తెరాసలో చేరని వారిని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని టిడిపి నేతలు చాలా రోజులుగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.