ఠారెత్తిస్తోన్న ఎండలు, 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే, ఏప్రిల్-మే నెలల్లో పరిస్థితి ఏంటి?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల కూడా రాకముందే ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతేకాదు, ఈ ఏడాది వడగాల్పులు కూడా ఎక్కువగా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
దేశవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. 1980 తరువాత ఉష్ణోగ్రతల్లో 0.6 డిగ్రీల పెరుగుదల కనిపిస్తోంది. గాలిలో తేమశాతం తగ్గిపోవడం వల్ల ఉష్ణోగ్రతల్లో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఉత్తర, వాయువ్య దిక్కు నుంచి గాలులు రావడం, తేమతగ్గిపోవడం, అల్పపీడనాలు లేకపోవడం వంటి కారణాలతో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోంది.
ఏప్రిల్ మే నెలల్లో 45-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు...
ఈ ఏడాది తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్, మే నెలల్లో 45-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలుంటాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం, వాతావరణశాఖ, యూనిసెఫ్ హైదరాబాద్, తెలంగాణ విపత్తు నిర్వహణ ఆధ్వర్యంలో అమీర్పేట సెస్లో శనివారం తెలంగాణ రాష్ట్రంలో ప్రతికూల వాతావరణ స్థితిగతులపై వర్క్ షాపు నిర్వహించారు.
వడగాల్పులపై ప్రజల్లో అవగాహన...
గతేడాది అత్యధిక ఉష్ణోగ్రతలు హైదరాబాద్లో 46.1 డిగ్రీలు, ఖమ్మంలో 48 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ విపత్తుల నిర్వహణ ముఖ్యకార్యదర్శి చంద్రవదన్ మాట్లాడుతూ ఎండతీవ్రత పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వడగాల్పులపై ప్రజల్లో అవగాహన పెంచేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. నగరాల్లోని ప్రధాన కూడళ్లలో తాగునీటి సదుపాయం, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతామన్నారు.
ముందు జగ్రత్త చర్యలు అవసరం...
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటిద్దాం' అనే గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 31 జిల్లాల నుంచి పలు విభాగాలకు చెందిన 250 మంది అధికారులు పాల్గొన్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగత్త్రలపై చర్చించారు.
ఆ ఐదు జిల్లాల్లో జాగ్రత్త...
మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం ఏపీలోని ఐదు జిల్లాలో వడగాలులు వీయవచ్చని చెప్పారు. గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, కడప, కర్నూలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎండలో బయటకు వెళ్లవద్దని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లినా, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
గాలివానలతో పాటు పిడుగులు...
తెలంగాణలో ఈ సంవత్సరం వడగాల్పులు ఎక్కువ రోజులు వీచే అవకాశాలున్నాయి. ఎండకాలంలో వడగాల్పులు, గాలివానలు వీచే అవకాశాలున్న ప్రాంతాల్లో జిల్లా స్థాయి అధికారులను అప్రమత్తం చేయండతో పాటు వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేస్తుంది. వేసవిలో వడగాల్పులు, గాలివానలతో పాటు పిడుగులు పడే అవకాశాలుంటాయని బేగంపేట వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు.