పూజలు చేసుకుంటే చంపేస్తారా?: పూజారి హత్యపై పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం
వరంగల్: పూజలు చేసుకుంటే చంపేస్తారా? అంటూ వరంగల్ జిల్లాలో జరిగిన పూజారి హత్య ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి. వరంగల్ అర్బన్ జిల్లా పోచమ్మ మైదాన్లోని శ్రీ శివసాయి మందిరం ప్రధాన అర్చకుడు సత్యనారాయణ(68)పై అక్టోబర్ 26న మరో వర్గానికి చెందిన యువకుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
అక్టోబర్ 26వ తేదీ తెల్లవారుజామున శ్రీ శివసాయి మందిరంలో భక్తి గీతాలను మైక్లో ప్రసారం చేస్తూ సాయిబాబాకు హారతిస్తున్న అర్చకుడు సత్యనారాయణతో ఎల్బీనగర్కు చెందిన సయ్యద్ సాధిక్ హుస్సేన్ మైక్ను ఆపాలంటూ గొడవ పడి భౌతిక దాడికి పాల్పడ్డాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధ పూజారి ఐదురోజులపాటు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొంది గురువారం ఉదయం మృతి చెందారు. దాడి ఘటనపై పలు హిందూ, బ్రాహ్మణ సంఘాలు ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి. ఆయన అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి.
ఈ నేపథ్యంలో పూజారి స్వగ్రామం మొగిలిచర్లకు చేరుకున్న పరిపూర్ణానందస్వామి అంత్యక్రియల్లో పాల్గొని పూజారికి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం స్వామి మాట్లాడుతూ.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మాట్లాడితే బహిష్కరిస్తారా? పూజలు చేస్తే చంపేస్తారా? అని నిలదీశారు.
మొగిలిచర్లకు వచ్చే మార్గంలో వందలాది మంది పోలీసులు తమను అడ్డుకోవడంపై స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నామా? అని మండిపడ్డారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని, అంతేగాక, మదర్సాలలో ఇలాంటి ఉన్మాదులు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు.
హిందువులకు రక్షణ లేకుండా పోతోందని, ఇలాంటి దాడులు జరుగుతుంటే ఇళ్లలో పూజలు, పండుగలు చేసుకోవాలా? వద్దా? అని పరిపూర్ణానంద స్వామి ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని అన్నారు. పూజారి హత్య ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.