ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ల నిరసన, సర్వీస్ సర్టిఫికెట్ ఇవ్వాలని, నియామకాల్లోనూ...
టీఎస్ఆర్టీసీ సమ్మె నిర్వహించిన సమయంలో విధులు నిర్వర్తించిన తాత్కాలిక డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. పోరుగడ్డ ఓరుగల్లులో నిరసన చేపట్టారు. తమకు సర్వీస్ సర్విఫికెట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్లో ఆర్టీసీ ఉద్యోగ నియామకాలు జరిగితే తమకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాటపట్టిన సంగతి తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సహా 26 డిమాండ్లతో 55 రోజులు సమ్మె కొనసాగించారు. దీంతో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో కలిసి ప్రభుత్వం సర్వీసులను నడిపించింది. తిరిగి ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడంతో.. తమ సంగతేంటని వారు ప్రశ్నిస్తున్నారు.
పనిచేసిన సమయానికి గానూ సర్వీస్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. తాము చేస్తున్న పని వదిలేసి ఆర్టీసీకి సేవలు అందించామని గుర్తుచేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతోనే విధులు నిర్వహించామని చెప్పారు. కానీ కార్మికులు తిరిగి విధుల్లో చేరడంతో తిరిగి రోడ్డున పడ్డామని చెప్తున్నారు. ఉన్న పని పోయింది, చేసిన పనిలో అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వమే తమకు ఉపాధి కల్పించాలని కోరారు. సర్వీస్ సర్టిఫికెట్తోపాటు భవిష్యత్లో ఆర్టీసీ నియామకాల్లో తమకే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ను విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ విలీనం సహా 26 డిమాండ్లతో కార్మికులు సమ్మె బాట పట్టారు. అక్టోబర్ 5 నుంచి 55 రోజులపాటు సమ్మె చేపట్టారు. హైకోర్టు కూడా కార్మికుల సమ్మె చెల్లదని చెప్పడం, లేబర్ కోర్టుకు పిటిషన్ ట్రాన్స్ఫర్ చేయడంతో.. కార్మికులు మెట్టుదిగారు. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత వారిని విధుల్లో చేర్చుకుంటామని.. కానీ భవిష్యత్లో మెలిక పెట్టకూడదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అయితే కార్మికులు సమ్మె సమయంలో విధులు నిర్వహించిన వారు తమ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు.