coronavirus:శభాష్.. కేసీఆర్, 3 నెలల అద్దె వాయిదాపై కిరాయిదారుల హర్షం, యజమానులు..
కరోనా వైరస్ వల్ల పని లేక, తినడానికి కూడా ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, కూలీలు, వలస కూలీల కోసం ప్రభుత్వం రేషన్ అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రూ.1500 నగదు కూడా అందజేసింది. అయితే కిరాయి ఉంటున్నవారికి ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. పని లేనందున మార్చి, ఏప్రిల్, మే.. మూడు నెలల కిరాయి వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్-1897 ప్రకారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై కిరాయిదారులు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ తీసుకున్న మంచి చర్య అని కొనియాడుతున్నారు.
రిలీఫ్..
రాజధాని హైదరాబాద్ సహా పట్టణాల్లో ఉండే కిరాయివారికి ఊరట కలిగింది. దీనిపై కొందరు మీడియాముఖంగా కూడా స్పందించారు. ప్రభుత్వ నిర్ణయంతో తమకు మేలు జరిగిందని నిజామాబాద్ కిరాయిదారులు హర్షం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో చర్యలకు ఉపక్రమించిందని పేర్కొన్నారు. తమ ఇంటి ఓనర్కు చెప్పామని.. తర్వాత ఇస్తామని చెబితే అంగీకరించారని పేర్కొన్నారు. తమను ఇంటి యాజమానులు ఇబ్బంది పెట్టడం లేదని పేర్కొన్నారు.
Recommended Video
ఈ సమయంలో..
రోజు కూలీ చేసుకునే తమకు కిరాయి కట్టడమే గగనమైపోతుందని మరొకరు వివరించారు. అలాంటిది ఇప్పుడు పని లేదని గుర్తుచేశారు. సరైన సమయంలో సీఎం తీసుకున్న నిర్ణయంతో తమలాంటి వారికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మరికొందరు తాము తినడానికి ఇబ్బందిగా ఉంది అని వాపోయారు. తమ సమస్యను అర్థం చేసుకొని రేషన్, నగదు ఇస్తోన్న సీఎం కేసీఆర్.. కిరాయి వాయిదా వేయాలని మంచి నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
యజమానులు మాత్రం..
అయితే నిజామాబాద్ సహా మరికొన్ని చోట్ల ఇంటి ఓనర్ల నుంచి వేధింపులు తప్పడం లేదు. ఇబ్బంది పెడితే డయల్ 100కి ఫోన్ చేయాలని చెప్పినా.. వినిపించుకోవడం లేదు. వారు అలానే చెబుతారు అని.. ఇంటి పన్ను, నల్ల పన్ను కట్టొద్దా అని అడిగారు. కిరాయి ఇవ్వకుంటే తమకు ఎలా గడుస్తోందని ప్రశ్నిస్తున్నారు. సీఎం చెప్పినట్టు డయల్ 100కి ఫోన్ చేస్తామని కిరాయిదారులు చెబుతున్నారు.