చెడు వ్యసనాలకు బలి.. దొంగల్లా మారిన టెన్నిస్ కోచ్, క్రికెటర్
హైదరాబాద్ : ఆటను నమ్ముకున్న ఇద్దరు అడ్డదారులు తొక్కారు. ఆటనే దైవంగా భావిస్తే మంచి గుర్తింపు పొందేవారు. కానీ ఆ దిశగా ప్రయత్నించలేదు. జల్సాలకు అలవాటు పడి జీవితం నాశనం చేసుకున్నారు. మొన్న రంజీ ట్రోఫీ ఆటగాడు, ఇవాళ టెన్నిస్ కోచ్ దొంగలుగా మారిన వైనంలో వారి బ్యాడ్ హ్యాబిట్స్ అధఃపాతాళానికి తోసేశాయి.
బొమ్మల రామారంలో టెన్షన్ టెన్షన్.. సైకో శీనుగాడి బాధిత కుటుంబాల నిరాహార దీక్ష
టెన్నిస్ కోచ్.. చోరీల్లో గన్ షాట్
హైదరాబాద్ కూకట్పల్లిలో టెన్నిస్ కోచ్ చోర లీలలు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా సుబ్బారావుపేటకు చెందిన కె. రామకృష్ణ (24సం.) గత రెండేళ్లుగా శాతవాహన నగర్ కాలనీలో నివసిస్తున్నాడు. టెన్నిస్ కోచ్గా పనిచేస్తూ వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ క్రమంలో తన దగ్గర శిక్షణ పొందే పిల్లల పేరేంట్స్తో నమ్మకంగా వ్యవహరించి, వారి ఇళ్లకు కన్నం పెట్టాడు.
సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లల్ని ఇంటి నుంచి తీసుకెళ్లడం.. మళ్లీ కోచింగ్ అయిపోయాక దిగబెట్టడంతో వారి పేరెంట్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. అలా వారు ఏ సమయాల్లో ఇంట్లో ఉంటున్నారు, ఎప్పుడు బయటకెళుతున్నారు తదితర విషయాలపై పక్కా సమాచారం సేకరించాడు. ఇక వారు లేని సమయాల్లో అదను చూసి దొంగతనాలు చేసేవాడు. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కిస్తున్నాడు.
రంజీ ఆటగాడు.. మోసాల్లో కేటుగాడు
క్రికెట్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి.. రంజీ ట్రోఫిలో ఆడేందుకు స్థానం సంపాదించుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజు పరిస్థితి కూడా అలాంటిదే. తన ఆటతో ప్రముఖుల మెప్పు పొందడమే గాకుండా.. అతడి పట్టుదల చూస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడనే నమ్మకం కనిపించేది. కానీ అతడి బుద్ధి వక్రదారి పట్టి అడ్డదారులు తొక్కాడు. దాంతో తన జీవితాన్ని తానే చేతులారా నాశనం చేసుకున్నాడు.
ఎంబీఏ వరకు చదువుకున్న నాగరాజుకు చిన్నప్పటి నుంచి క్రికెట్పై మక్కువ ఎక్కువ. అలా క్రికెట్లో మెళకువలు నేర్చుకుని.. 2006లో విశాఖ తరపున అండర్ 14కి సెలెక్ట్ అయ్యాడు. అంతేకాదు అదే సంవత్సరం నిర్విరామంగా 84గంటల పాటు క్రికెట్ ఆడి వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. నాగరాజు ప్రతిభకు గుర్తింపుగా టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కె ప్రసాద్ చేతుల మీదుగా బహుమతి కూడా అందుకున్నాడు.
ఎంఎస్కె పేరుతో మోసాలకు తెర..!
అలా ఎంఎస్కె ప్రసాద్తో ఏర్పడిన పరిచయం ఆసరాగా చేసుకుని అడ్డదారులు తొక్కాడు. ఆయన పేరుతో విజయవాడలోని పలువురు ప్రముఖులకు ఫోన్ చేసి ఎంఎస్కె ప్రసాద్ పేరుతో మాట్లాడేవాడు. ఒక క్రికెటర్ను పంపిస్తున్నాను, అతడికి ఆర్థిక సాయం చేయండంటూ చెప్పేవాడు. అలా వారు ఓకే చెప్పగానే.. నాగరాజే స్వయంగా వెళ్లి డబ్బులు తెచ్చుకునేవాడు. ఆ విధంగా చాలామంది దగ్గర లక్షలు వసూలు చేశాడనే ఆరోపణలున్నాయి.
కొన్నాళ్లకు విషయం కాస్తా ఎంఎస్కె ప్రసాద్ దృష్టికి వెళ్లడంతో.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.దాంతో నాగరాజును అరెస్ట్ చేసి కటాకటాల్లోకి నెట్టారు. గతంలో కూడా విశాఖలో ఛీటింగ్ కేసు నమోదైంది. ఒకసారి జైలుకు వెళ్లొచ్చాక కూడా అతని బుద్ధి మారలేదు.
చెడు వ్యసనాలతో జీవితం నాశనం
ఈ ఇద్దరి ఆటగాళ్ల విషయంలో చెడు వ్యసనాలే వారి కొంప ముంచాయి. ఉన్నదాంట్లో సంతృప్తి చెందక లేనివాటికోసం ఆరాటపడి చివరకు చిక్కుల్లో పడ్డారు. ఎదిగే క్రమంలో తప్పటగులు మనిషిని ఎలా దిగజార్చుతాయనేది వీరిద్దరి వ్యవహారంతో తెలిసిపోతోంది. లేని పోని కోరికలతో అందమైన భవిష్యత్తును నాశనం చేసుకున్నారు.