ఆ నియోజకవర్గానికి పదుల సంఖ్యలో నామినేషన్లు ? ఎందుకంటే, కారణమిదేనా ?
హైదరాబాద్ : తొలివిడత లోక్సభ ఎన్నికలకు దేశవ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒక్కో నియోజకవర్గంలో మహా అయితే నాలుగు లేదంటే ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉంటారు. కానీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిత్వానికి మాత్రం పదుల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.
బరిలో రైతులు, ఎందుకంటే ?
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి రైతులు బరిలోకి దిగుతున్నారు. సోమవారం దాఖలైన నామినేషన్లు కాకుండానే ఇప్పటికే 56 మంది నామపత్రాలు వేశారు. ఇందులో 50 మంది రైతులు ఉన్నారు. పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేసిని జిల్లా రైతులు నామినేషన్లు వేసి వినూత్నంగా నిరసన చేపట్టారు. తమ గోడును నేతలు పట్టించుకోలేదని, అందుకే నానినేషన్ వేశామని పసుపు, ఎర్రజొన్న రైతులు చెప్తున్నారు.
గడువు ముగుస్తోంది .. క్యూలో రైతులు
పక్క ఫోటోలో కనిపిస్తోన్న రైతులు, ఎరువుల కోసమో, విత్తనాల కోసమే క్యూ లైన్లలో నిల్చోదు. నామినేషన్ వేసేందుకు నిలబడ్డారు. ఇప్పటికే 50 మంది ఉండగా .. మరో 15 మంది వరకు రైతులు నామినేషన్ దాఖలయ్యే అవకాశం ఉంది. అంటే 70 వరకు అభ్యర్థుల పేర్లు ఉంటుండగా .. వారిలో ఎంతమంది విత్ డ్రా చేసుకుంటారో, లేదంటే బరిలో ఉంటారో చూడాలి.
బరిలో కవిత, యాష్కీ, అరవింద్
ఇందూరు లోక్సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ కవిత టీఆర్ఎస్, మధుయాష్కీ గౌడ్ కాంగ్రెస్, ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి గెలుస్తానని కవిత ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు గెలిచి, కేంద్రంలో చక్రం తిప్పాలని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రజలను కోరిన సంగతి తెలిసిందే. 2014 కాక .. మిగతా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడినుంచి మధుయాష్కీ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. బీజేపీ నుంచి బరిలోకి దిగిన అరవింద్ .. తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.