ఏపీ, టీ వాగ్వాదం: నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తత, భారీగా పోలీసులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారుల వాగ్వాదంతో మరోసారి నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారుల వాగ్వాదంతో మరోసారి నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నాగార్జునసాగర్ డ్యామ్ కుడి కాలువ నుంచి ఏపీకి నీటి విడుదలను తెలంగాణ అధికారులు అడ్డున్నారు.
జలాశయంలో తమకు రావాల్సిన వాటా పూర్తి కాకుండా, ఏపీకి నీటిని ఎలా తీసుకువెళతారని వారు నిలదీశారు. వేసవిలో తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నామని ఏపీ అధికారులు చెప్పినా వినలేదు.
దీంతో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. తాగునీటి కోసం హైదరాబాద్కు నీటిని తరలించాలని తెలంగాణ అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఏపీకి కుడికాల్వ ద్వారా 2 టీఎంసీల తాగునీటిని కృష్ణా బోర్డు కేటాయించింది.
రోజుకు 7 వేల క్యూసెక్కుల చొప్పున 2 టీఎంసీల నీరు కేటాయించారు. అయితే, అదనంగా మరో 1టీఎంసీ నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు ప్రయత్నించగా.. టీ అధికారులు అడ్డుకున్నారు. కృష్ణా ట్రిబ్యూనల్ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని వారు సూచించారు. దీన్ని ట్రిబ్యూనల్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
కాగా, వాగ్వాదం పెరిగి ఉద్రిక్తత నెలకొనడంతో, ఏపీ అధికారులకు రక్షణగా ఏపీ పోలీసులు, తెలంగాణ అధికారులకు రక్షణగా తెలంగాణ పోలీసులు మోహరించారు. దీంతో డ్యాం వద్ద వాతావరణం వేడెక్కింది. గతంలో కూడా పలుమార్లు ఇక్కడ ఏపీ, టీ అధికారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.