రామగిరి ఓపెన్ కాస్ట్ బొగ్గుగని వద్ద టెన్షన్.. భూనిర్వాసితుల ధర్నాతో ఉద్రిక్తత.. ఎందుకంటే!!
పెద్దపల్లి జిల్లా రామగిరి ఓపెన్ కాస్ట్ బొగ్గు గని వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా భూ నిర్వాసితులు పెద్దఎత్తున ధర్నాకు దిగారు. రామగిరి ఓపెన్ కాస్ట్ గనిలోకి దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ టెన్షన్ నెలకొంది.
తెలంగాణా రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం ఓపెన్ కాస్ట్ మైన్ 2 కోసం చేపట్టిన విస్తరణలో భాగంగా లద్నాపూర్ గ్రామంలోని ఇళ్లను స్వాధీనం చేసుకోవటానికి అధికారులు వారికి నష్టపరిహారం ఇస్తామని, పునరావాస ప్యాకేజీని ఇస్తామని ప్రకటించారు. కానీ పరిహారం ఇవ్వకుండానే లద్నాపూర్ గ్రామంలోని ఇళ్ళను అధికారులు కూల్చివేశారు. దీంతో భూ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. రామగిరి ఓపెన్ కాస్ట్ మైన్ లోకి ఆందోళనకారులు దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డగించారు .దీంతో పోలీసులకు, భూనిర్వాసితులకు మధ్య వాగ్వాదం పెరిగి ఉద్రిక్తతలకు కారణమైంది.

తమ ఇళ్లను కూల్చివేయడంపై భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు గని లోపలికి ప్రవేశించకుండా భూ నిర్వాసితులు అడ్డుకోవడంతో గని బయట బైఠాయించిన నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు. తమ ఇళ్లను కూల్చివేసి, మైనింగ్ చేయడానికి అధికారులు ప్రకటించిన పునరావాస ప్యాకేజీ అందకపోవడంతో 283 మంది భూనిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేశారు అంటూ భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమకు పునరావాస ప్యాకేజీ అందించిన తర్వాతే మైనింగ్ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆందోళన బాట పట్టిన భూ నిర్వాసితులను పెద్దపల్లి ఆర్డీవో నరసింహమూర్తి శాంతింపజేసే ప్రయత్నం చేశారు. సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి పరిహారం ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే బాధితుల ఇళ్లను కూల్చివేసిన ఘటనను జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ తీవ్రంగా ఖండించారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.