భయం గుప్పిట్లో ఏజెన్సీ గ్రామాలు .. కొత్తగూడతో పాటు పోలీసుల బందీలో పలు మండలాలు .. రీజన్ ఇదే !!
తెలంగాణా రాష్ట్రంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. భారీగా మావోయిస్టులు వాగును దాటుతున్న దృశ్యాన్ని పోలీసుల డ్రోన్ కెమెరా చిత్రీకరించిన విషయం తెలిసిందే. చత్తీస్ గడ్ నుండి తెలంగాణ వైపు మావోయిస్టులు వచ్చినట్టుగా ఈ వీడియో ద్వారా గుర్తించిన పోలీసులు అలెర్ట్ అయ్యారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా కొత్త గూడా ,ములుగు, భద్రాచలం, పినపాక, మంథని అటవీ ప్రాంతాలలో పోలీసులు అడుగడుగునా గాలిస్తున్నారు .
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని పెదనల్లబెల్లి అతి సమీపంలో గల ఛత్తీస్ గడ్ సుక్మా జిల్లా కిష్టారం ప్రాంత అడవుల్లో గిరిజనులతో కలిసి మావోలు ఒక వాగును దాటినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పటి నుండి ముమ్మరంగా గాలింపు చేపట్టారు పోలీసులు . మావోయిస్టు దళ సభ్యులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నారని భావిస్తున్న పోలీసులు కొత్తగూడ మండల కేంద్రంలో నేడు తనిఖీలు నిర్వహించారు. దీంతో కొత్త గూడ మండలం భయం గుప్పిట్లో ఉంది . ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితిలో ఉంది .
మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన కొత్తగూడ, గంగారం మండలాల్లో మావోయిస్టుల ఉనికి ఎక్కువగా ఉన్నట్లు తాజాగా ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. తాజాగా డ్రోన్ కెమెరాల ద్వారా మావోయిస్ట్ ల కదలికలను గుర్తించిన నేపధ్యంలో రెండు మండలాలు కొత్తగూడ, గంగారం ఎస్సైల ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు సానుభూతిపరులను ,మాజీలను పోలీసులు విచారిస్తున్నారు . వారిపై నిఘా పెట్టారు .
మండలంలో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చిన వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి ఉంది .కిష్టారం అటవీ ప్రాంతంలో గిరిజనులతో సమావేశం నిర్వహించినట్టు అనుమానంతో ఉన్న పోలీసులు వాగు దాటుతున్న దృశ్యాలు డ్రోన్ కెమెరా రికార్డ్ చెయ్యటంతో వారిలో చాలా మంది నక్సలైట్లు ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఏజెన్సీ ప్రాంతాలను తమ కంట్రోల్ లోకి తీసుకుంటున్నారు .