గుర్రంపోడులో ఉద్రిక్తత: కేసీఆర్ మరో మూడేళ్లేనంటూ విజయశాంతి, బండి సంజయ్ హెచ్చరిక
సూర్యపేట: జిల్లాలోని మఠంపల్లి మండలం పెద్దవీడు పరిధిలోని 540 సర్వే నెంబర్ గల వివాదాస్పద భూమి(గుర్రంపోడు భూములు)ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆదివారం సదర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన గిరిజన భరోసా యాత్రలో భాగంగా ఆయన ఈ భూమిని సందర్శించారు.
గుర్రంపోడులో ఉద్రిక్తత..
కాగా, వివాదాస్పద గుర్రంపోడు భూముల్లో ఓ ప్రైవేటు కంపెనీ ఏర్పాటు చేసిన షెడ్పై బీజేపీ కార్యకర్తలు, గిరిజనులు రాళ్లు విసరడంతోపాటు షెడ్ను ధ్వంసం చేశారు. కాగా, షెడ్పైకి విసిరిన రాళ్లు కోదాడ డీఎస్పీ రఘు, హుజూర్నగర్ సీఐ రాఘవరావుతోపాటు ఇద్దరు ఎస్సైలకు తగిలాయి. దీంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. అంతకుముందు టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
భారీగా మోహరించిన పోలీసులు
కాగా, గుర్రంపోడు తండాలో తమ భూములు (సర్వేనంబర్ 540) కబ్జాకు గురయ్యాయంటూ గత కొంతకాలంగా స్థానిక గిరిజనులు ఆందోళన చేపడుతున్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలను తెలుసుకునేందుకు బండి సంజయ్ నేతృత్వంలో బిజేపి బృందం గుర్రంపోడుతండాకు వెళ్లింది. సంజయ్ తోపాటు విజయశాంతి, ఇతర బీజేపీ నేతలు ర్యాలీగా వెళ్లారు. దీం పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇదే సమయంలో గిరిజన యాత్రకు స్థానికులు కూడా భారీగా తరలివచ్చారు.
బండి సంజయ్ హెచ్చరిక
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. గిరిజనుల దాడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల ప్రతి కన్నీటి చుక్క టీఆర్ఎస్పై ఎదురుదాడికి దిగుతుందని హెచ్చరించారు. టీఆర్ఎస్ కరెప్షన్ ఉన్న క్యారెక్టర్ లేని పార్టీ అని విమర్శించారు. బీజేపీకి ఓట్లు, సీట్లు ముఖ్యం కాదని, పేదల బాగోగులే ముఖ్యమని చెప్పారు. పేదల ఉసురు సీఎం కేసీఆర్కు తగలకమానదని బండి సంజయ్ దుయ్యబట్టారు.
కేసీఆర్తో పనిచేసినందుకు సిగ్గుపడుతున్నా..: విజయశాంతి
అనంతరం నిర్వహించిన సభలో విజయశాంతి మాట్లాడారు. కేసీఆర్ దొర ఎవరిని దోచుకుంటున్నవు.. తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ తెస్తే.. నీవు నీ కుటుంబం అంత తెలంగాణను దొచుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు. ఇలాంటి వ్యక్తితో పనిచేసినందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. టీఆర్ఎస్కు తెలంగాణలో రెండోసారి అధికారం ఇచ్చి తప్పు చేశాన్నారు. ఇంత దోపిడీ జరుగుతున్నా.. ఎందుకు మౌనంగా ఉన్నావంటూ కేసీఆర్ను ప్రశ్నించారు. బనిసలుగా ఉండకూడదు.. మీకు ఏది దక్కనప్పుడు తిరగబడాల్సిందే. మరోపదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే యావత్ తెలంగాణ నాశనం అవుతుందని అక్కడి ప్రజలనుద్దేశించి విజయశాంతి వ్యాఖ్యానించారు. ఇంతమందిని ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్ అసలు మనిషేనా? తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఎముడయ్యాడని విమర్శించారు. ఇప్పుడు బీజేపీ వచ్చింది.. అడుగడుగునా నిలదీస్తుంది. రాష్ట్రంలో యువకులను నాశనం చేశారు. బీజేపీ వస్తే యువకులకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్కు చెంపగిలేలా చెయ్యాలి.. కేసీఆర్ను గద్దె దించాలి. ఈ సారి ఓటుతో టీఆర్ఎస్కు బుద్ది చెప్పాలని విజయశాంతి ప్రజలకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ మరో మూడేళ్లు.. పదేళ్లు కాదు..
'ముఖ్యమంత్రి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని చెప్పినందుకు సంతోషం. వీరి పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యమే ఆందోళనకరంగా తయారైంది. ఈ అధికార పార్టీ దోపిడీలతో సామాన్య ప్రజల జీవన పరిస్థితులే ప్రమాదంలోకి పడిపోతున్నాయి. అయితే, సీఎం పదవికి దళిత బిడ్డలను మోసగించి, వారసునికెట్లా కట్టబెడతావని ప్రజలు, బీజేపీ నిలదీస్తున్న భయానికి 10 ఏళ్లు నేనే సీఎం అంటూ.... ఏవో మాయమాటలు చెప్పి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే, మబ్బుల మాటున ఉండే వానా కాలపు సూర్యుడిలా.... మరో పదేళ్ళ పాటు ఎప్పుడు ప్రగతి భవన్లో కనిపిస్తాడో... ఎప్పుడు ఫాం హౌస్లో దర్శనమిస్తాడో అర్థంకాని అయోమయంతో జనం తననే భరించాలని హెచ్చరిస్తున్నట్టుంది. పదేళ్ళ వరకూ ఎందుకు... కేసీఆర్ 'కారు'మబ్బుల్ని తెలంగాణ ప్రజల మరో మూడేళ్ళలోనే చెదరగొడతారని ఆయన అర్థం చేసుకునే రోజులు దగ్గర పడుతున్నాయి' అని విజయశాంతి సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.