రోజంతా ఉత్కంఠ: ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీరుపై వెల్లువెత్తిన నిరసన
జిల్లా కలెక్టర్ ప్రీతిమీన చేసిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే శంకర్నాయక్పై పట్టణ పోలీసు స్టేషన్లో బుధవారం రాత్రి కేసు నమోదైన సంఘటన జిల్లాలో ఉత్కంఠ రేకెత్తించింది.
మహబూబాబాద్ : జిల్లా కలెక్టర్ ప్రీతిమీన చేసిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే శంకర్నాయక్పై పట్టణ పోలీసు స్టేషన్లో బుధవారం రాత్రి కేసు నమోదైన సంఘటన జిల్లాలో ఉత్కంఠ రేకెత్తించింది. ఓ వైపు ఎమ్మెల్యే పోలీసు స్టేషన్కు వచ్చి వెళ్లడం, వివిధ పార్టీల నేతలు ఎమ్మెల్యేను పదవి నుంచి తొలగించాలంటూ నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్, శాసనసభ సభ్యుడి మధ్య ఈ సంఘటన జరగడంతో అధికారుల్లోనూ ఆందోళన చోటు చేసుకుంది. రాజకీయ, అధికార వర్గాలను సమన్వయ పరుస్తూనే పట్టణంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పట్టణంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో మొక్కలు నాటేందుకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్నాయక్ పాల్గొన్న సంగతి విదితమే.
మొక్కలు నాటి తిరిగి వెళుతున్న సందర్భంలో ఎమ్మెల్యే శంకర్నాయక్ కలెక్టర్ ప్రీతిమీనా చేతిని పట్టుకొని పక్కకు నెట్టివేసినట్టు వచ్చిన ఆరోపణలు జిల్లాలో కలకలం సృష్టించింది. ఈ విషయంలో ఎమ్మెల్యే కలెక్టర్కు క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ కలెక్టర్ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపధ్యంలో పోలీసుల ఎమ్మెల్యైపై కేసు నమోదు చేశారు.
Recommended Video
ఈ నేపధ్యంలో గురువారం ఉదయం ఎమ్మెల్యేను అరెస్టు చేస్తారనే ప్రచారం జిల్లాలో వ్యాపించింది. దీంతో పట్టణ పోలీసు స్టేషన్ పరిసరాల్లో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పటికే ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు ఒక్కొక్కరుగా స్టేషన్ సమీపానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ సంఘటన విచారణాధికారిగా నియామకమైన తొర్రూరు డీఎస్పీ రాజారత్నంతో పాటు మహబూబాబాద్ డీఎస్పీ రాజమహేంద్రనాయక్ సంఘటన వివరాలను ఎమ్మెల్యే ద్వారా తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే హోదాలో ఉన్న శంకర్నాయక్కు సుప్రీం కోర్టు సూచనల మేరకు నోటీసులు ఇచ్చి తమ పరిధి మేర ఆయనను పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేయడంతో ఉత్కంఠతకు తెరపడింది. పట్టణ పోలీసు స్టేషన్ నుంచి నేరుగా క్యాంపు కార్యాలయానికి శంకర్ నాయక్ వెళ్లారు. అక్కడ నుంచి కేసముద్రం మండలంలోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు పోలీసు బందోబస్తు మధ్య తన అనుచరులతో భారీ వాహణ శ్రేణితో వెళ్లారు.
ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. మరోవైపు కలెక్టర్ ప్రీతిమీనా తొర్రూరులోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని తనిఖీ చేసి ఆ తర్వాత హైదరాబాద్లో జరుగనున్న ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశానికి వెళ్లినట్లు సమాచారం. ఈ సంఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.