ఏపీకి కేటాయిస్తారా?: తాళాలు పగులగొట్టి పెట్రోల్ బాటిళ్లతో ఆఫీస్లోకి ఉద్యోగులు
హైదరాబాద్: నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమను ఆంధ్రప్రదేశ్కు కేటాయించారని, వెంటనే తెలంగాణకు తమను కేటాయించాలని డిమాండ్ చేస్తూ నాలుగో తరగతి ఉద్యోగులు పెట్రోలు బాటిళ్లతో ఆందోళన చేపట్టారు.
దాదాపు 650 మంది ఉద్యోగులు సోమవారం ఉదయం ఆందోళన చేపట్టారు. దీంతో నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమను తిరిగి తెలంగాణకే కేటాయించాలని డిమాండ్ చేశారు. టీఎన్జీవో భవన్ తాళాలు పగులగొట్టిన ఉద్యోగులు లోపలకు వెళ్లి, పెట్రోలు బాటిళ్లతో బైఠాయిచారు.
తమను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కు కేటాయించారని వారు వాపోయారు. నాలుగో తరగతి ఉద్యోగులంటేనే చాలీచాలని బతుకు అన్నారు. అలాంటి తమను ఏపీకి కేటాయించడం సరికాదన్నారు. తమకు న్యాయం జరిగితే చావే శరణ్యమని వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు.
తమను తెలంగాణకు కేటాయించకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. కాగా, గ్రూప్ ఫోర్ ఉద్యోగులు గత రెండేళ్లుగా ఈ విషయంపై ఆందోళన చేస్తున్నారు. తమకు ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సుమారు 700 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను వెంటనే తెలంగాణకు బదిలీ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.