'కొంగు పట్టి అడుగుతున్నా.. మీ బిడ్డ లాంటిదాన్ని సారు..' ఎమ్మెల్సీ పల్లా కాళ్లపై పడి వేడుకున్న మహిళ...
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన ఎదురైంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగం కోల్పోయిన ఓ మహిళా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రాజేశ్వర్ రెడ్డి కాళ్లపై పడి వేడుకుంది. 'తెలంగాణ వస్తే కొలువులు వస్తాయనుకున్నాం కానీ... ఇలా ఉన్న కొలువులే పోతాయని అనుకోలేదు.. దయచేసి మా కొలువులను మాకు ఇప్పించండి సార్..' అంటూ ఆ మహిళ రాజేశ్వర్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది.
మా పొట్ట కొట్టవద్దంటూ ఆవేదన
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(ఫిబ్రవరి 4) ఖమ్మం జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై ఉన్న సమయంలో కృష్ణవేణి అనే ఓ మహిళ వచ్చి ఆయన కాళ్లపై పడింది. ఖమ్మం జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న తనను అన్యాయంగా తొలగించారని... తనకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరింది. 'మా పొట్ట కొట్టవద్దు... మీ పాదాలు పట్టుకుంటా...' అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది.
ఉన్న కొలువులే పోతాయనుకోలేదు...
'తెలంగాణ వస్తే కొలువులు వస్తాయనుకున్నాం. కానీ ఉన్న కొలువులు పోతాయని ఉహించలేదు సార్.. మాకు పర్మినెంట్ ఉద్యోగం లేక పోయినా ఫర్వాలేదు.. ఉన్న కొలువులను పునరుద్ధరణ చేయండి. తెలంగాణ ఉద్యమంలో మేమూ పోరాడినం. కొంగు పట్టి అడుగుతున్న మీ బిడ్డ లాంటిదాన్ని సారు.' అని కృష్ణవేణి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని వేడుకుంది. తొలగించిన ఫిల్డ్ అసిస్టెంట్లను తిరిగి వీధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కొంగు చూపి ఆయన్ను అభ్యర్థించింది.
7700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తప్పించిన ప్రభుత్వం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద చేపట్టే కార్యక్రమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలకంగా వ్యవహరించేవారు. అయితే గతేడాది ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థను రద్దు చేసి ఆ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమను శాశ్వత ప్రాతిపదికన నియమించి వేతనాలు పెంచాలనే డిమాండ్తో దాదాపు 7,700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు అప్పట్లో సమ్మె చేపట్టారు. ఆ సమ్మె కారణంగా ప్రభుత్వం వారిని విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కోల్పోయిన తమ ఉద్యోగాల కోసం ఫీల్డ్ అసిస్టెంట్లు పోరాడుతూనే ఉన్నారు.
ఇటీవలే హైదరాబాద్లో భారీ నిరసన...
ఇటీవలే తమ ఉద్యోగాల సాధనకై వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు హైదరాబాద్కు తరలివచ్చిన నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే. ఫీల్ట్ అసిస్టెంట్ల జేఏసీ ఆధ్వర్యంలో హిమాయత్నగర్లోని రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యా లయాన్ని ముట్టడించారు.15 ఏళ్లుగా ఉపాధి హామీ చట్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం అన్యాయమని వారు వాపోయారు. తొలగించిన 7,500 మందిలో 7,300 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక తరగతులకు చెందినవారేనని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా మానవతా దృక్పథంతో వారిని విధుల్లోకి తీసుకోవాలనీ, లేనిపక్షంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.