తలసాని తికమక..! మొన్నటి వరకూ కాంగ్రెస్ ఎక్కడుందన్న టీఆర్ఎస్..! ఇప్పుడు ప్రత్యామ్నాయమట..!!
హైదరాబాద్ : తెలంగాణలో అదికార గులాబీ పార్టీ పరిస్థితి విచిత్రంగా తయారయ్యింది. తెలంగాణలో అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలని భావించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసింది. ఐతే ప్రతిపక్షం లేకుండా చేసామన్న సంతోషాన్ని గులాబీ పార్టీకి ఎక్కువరోజులు ఉండనీయలేదు భారతీయ జనతా పార్టీ. గత పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు స్థానాలు గెలుచుకోవడం, కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో రెండవ సారి అదికారంలోకి రావడం, తాజాగా బీజేపి అదిష్టానం రెండు తెలుగు రాష్ట్రాల మీద కన్నేసి పెట్టడం ముఖ్యంగా గులాబీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
గులాబీ పార్టీకి కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం..! తలసాని సంచలన వ్యాఖ్యలు..!!
అంతే కాకుండా తెలంగాణలో బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపి రంగం సిద్దం చేసింది. అందులో గులాబీ పార్టీ కి చెందిన నేతలు కూడా ఉన్నారని తెలంగాణ బీజేపి నామకత్వం ఘంటాపథంగా చెప్పుకొస్తోంది. దీంతో కలవరపాటుకు గురౌతున్న టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను అసందర్బ ప్రకటనలతో అయోమయానికి గురి చేస్తున్నరు. తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతమైందని మొన్నటి వరకూ చెప్పుకొచ్చిన టీఆర్ఎస్ నాయకులు, బీజేపిని నిలువరించేందుకు మళ్లీ కాంగ్రెస్ రాగం అందుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం లో రెండో సారి మంత్రి పదవి చేపట్టిన తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి విచిత్ర వ్యాఖ్యలు చేసారు.
బీజేపి కి అంత సినిమా లేదు..! ఓటు బ్యాంకు ఎక్కడుందన్న తలసాని..!!
నిన్నటి వరకూ ఏమీ లేదన్న కాంగ్రెస్ పార్టీని పట్టుకుని అదికార గులాబీ పార్టీకి కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం అని తేల్చిచెప్పేసారు తలసాని. తలసాని వ్యాఖ్యలు రాజకీయాంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణలో తమకు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం కాబోదని అంటున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణలో భారతీయ జనతా పార్టీలోకి చేరికలు ఊపందుకోవడం ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ మంచి ఫలితాలను పొందిన నేపథ్యంలో ఆ పార్టీకి ఈ రాష్ట్రంపై ఆశలు ఏ స్థాయికి పెరిగాయో తెలిసిన సంగతే.
కాంగ్రెస్ లెజిస్లేచర్ ను విలీనం చేసుకున్న టీఆర్ఎస్..! ఇప్పుడు అదే పార్టీ ప్రత్యామ్నాయమట..!!
ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు కూడా. ఈ పరిణామాల నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సమితికి బీజేపీ ప్రత్యామ్నాయం కాదు కాలేదని అన్నట్టుగా మాట్లాడారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఐతేగియితే తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం అయ్యేది కేవలం కాంగ్రెస్ పార్టీనే అని తలసాని అనడం విశేషం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బేస్ మెంట్ ఉందని ఓటు బ్యాంకు ఉందని అంటున్నారు తలసాని! ఇలా ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీకి ఈయన కితాబివ్వడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
బీజేపి ఎదుగుదలను అడ్డుకోవాలి..! వినూత్నంగా అడుగులు వేస్తున్న గులాబీ పార్టీ..!!
అందులోని రహస్యం ఏంటో కాస్త ఆలోచిస్తే అందరికీ అర్థం అయ్యేదే అంశమే. భారతీయ జనతా పార్టీ శరవేగంగా పుంజుకుంటోందని విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో అదిగో కాంగ్రెస్ ఉంది.. అన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి నేత మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ విభాగాన్ని కూడా టీఆర్ఎస్ వాళ్లు విలీనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదని తేల్చారు. అయితే ఇప్పుడు బీజేపీ తాము ప్రత్యామ్నాయం అంటుండే సరికి అదిగో కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు ఉంది. అని టీఆర్ఎస్ వాళ్లు అంటున్నారు. బీజేపీపై కోపం తో వీరు కాంగ్రెస్ మీద ప్రేమను ఒలకపోస్తూ ఉన్నారని స్పష్టం అవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.