రాష్ట్రం ఏర్పడినా.. ప్రజల బతుకుల్లో మార్పేది?: కేసీఆర్పై తమ్మినేని ఫైర్
రాష్ట్రం ఏర్పడినా ప్రజల బతుకుల్లో ఎటువంటి మార్పు లేదని, గతంలో ఎలాంటి పరిస్థితి ఉందో , ఇప్పుడూ అదే తీరు నెలకొందని తమ్మినేని వీరభద్రం అన్నారు.
వరంగల్: రాష్ట్రం ఏర్పడినా ప్రజల బతుకుల్లో ఎటువంటి మార్పు లేదని, గతంలో ఎలాంటి పరిస్థితి ఉందో , ఇప్పుడూ అదే తీరు నెలకొందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాజన పాదయాత్రలో భాగంగా సోమవారం రాత్రి నర్సంపేటలోని అతిథి గృహం ఎదుట జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలు అనుభవించే అవకాశాలు ఉండాలన్నారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి కోసం తాము చేపట్టిన పాదయాత్ర సెగ ముఖ్యమంత్రి కేసీఆర్కు తగిలిందన్నారు. అందుకే ఏ రోజూ బీసీల గురించి మాట్లాడని సీఎం కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. కులాల మధ్య తగవులు పెడుతున్నారని విమర్శించారు.
బీసీ ఉప ప్రణాళిక చట్టాన్ని రూపొందించి, బడ్జెట్ను కేటాయించి అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. దీనివల్ల 106 కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను ఇతర పనులకు మళ్లిస్తే నాడు విమర్శించిన కేసీఆర్.. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను మిషన్ భగీరథకు మళ్లించారని ఆరోపించారు.
మిషన్ కాకతీయ పనుల వల్ల రైతులు చెరువు కట్టలపై విందులు చేసుకుంటున్నారని చెబుతున్నారని అన్నారు. ఆ దావతులు చేసుకుంటున్నది అన్నదాతలు కాదని, గుత్తేదారులు నిర్వహించుకుంటున్నారని చెప్పారు. కల్లు పాలసీపై ప్రభుత్వానికి విధానం లేకుండా పోయిందన్నారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. అణచివేతకు గురవుతున్న ప్రజలంతా సంఘటితమై పోరాడాలన్నారు.
మున్ముందు ప్రజల కోసం తమ పార్టీ ముందుండి ఉద్యమాలు చేస్తుందన్నారు. సభలో మహాజన పాదయాత్ర ఉప నాయకుడు జాన్వెస్లీ, సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కయ్య, వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐయూ, ప్రజా సంఘాల నాయకులు రమేష్, కేదారి, రవి, కుమారస్వామి, ప్రణయ్దీప్, పెద్దారపు రమేష్, సమ్మయ్య, యువరాజు, సంజీవ, భారతి, కుమారస్వామి పాల్గొన్నారు.