కేసీఆర్కు మా శక్తి చూపుతాం: తమ్మినేని వీరభద్రం
రాష్ట్రంలో 93 శాతం ఉన్న సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరించి పనిచేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి తమ శక్తి ఎంటో చూపిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
వరంగల్: రాష్ట్రంలో 93 శాతం ఉన్న సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరించి పనిచేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి తమ శక్తి ఎంటో చూపిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పేదలు వేసుకున్న గుడిసెల స్థానంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించకుండా తొలగించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం గత సంవత్సరం అక్టోబర్ 17న చేపట్టిన మహాజన పాదయాత్ర సోమవారం వరంగల్ నగరానికి చేరుకుంది.
ఈ సందర్భంగా హన్మకొండ అశోక హోటల్ ఎదుట, ఖిలా వరంగల్ పడమరకోటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో తమ్మినేని మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఎంబీసీల బతుకులు బాగుపడినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సార్థకత ఉంటుందన్నారు. దళితులకు మూడెకరాలు భూమి, రెండు పడకల ఇళ్లు, రిజర్వేషన్లు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ లేకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యమన్నారు.
బీసీ సబ్ప్లాన్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ రెండున్నర సంవత్సరాల పాలనలో ఎర్రవెల్లి, నర్సన్నపేటలో 500 రెండు పడకల ఇళ్లు నిర్మించి రాష్ట్రమంతా చూపుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తాను పాదయాత్రలో 18 జిల్లాలు, 800 గ్రామాలు తిరిగానని, ఎక్కడా రెండు పడకల ఇళ్లు నిర్మించలేదన్నారు. రాబోయే రోజుల్లో సామాజిక నాయ్యం, తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం వామపక్ష, అంబేడ్కర్ వాదులతో కలసి ఐక్య వేదిక ఏర్పాటు చేసి ఉద్యమిస్తామన్నారు.
తెలంగాణ అంటే టిఆర్ఎస్ కాదని, తెలంగాణ అంటే ఎర్రజెండా అనేలా ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. రాత్రి ఖిలావరంగల్ పడమరకోట చమన్ జంక్షన్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణే ధ్యేయంగా సీపీఎం ముందుకు సాగుతుందన్నారు. వరంగల్ నగరంలో విమానశ్రయం ఏర్పాటు చేస్తే అభివృద్ధి కాదని, విమానం ఎక్కే శక్తి ప్రజలకు వస్తేనే అభివృద్ధి సాధించినట్లున్నారు.
నిజాయతీగా పనిచేసేది కేవలం ఎర్ర జెండా పార్టీ మాత్రమేనన్నారు. జి.నాగయ్య, దళితరత్న బొమ్మల కట్టయ్య, పాదయాత్ర బృంద సభ్యుడు అబ్బాస్ తదితరులు మాట్లాడారు. ఖిలావరంగల్ అభివృద్ధి కోసం భూమిని కోల్పోయిన రైతులు, కాంగ్రెస్ హయాంలో పట్టాలు పొందిన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని, వాంబే కాలనీ సమస్యలను పరిష్కరించాలని, పర్యటక రంగం అభివృద్ధి చేయాలని, దళిత కాలనీల సమస్యలు పరిష్కరించేలా చూడాలని పలువురు తమ్మినేనికి వినతిపత్రాలు అందజేశారు.
హన్మకొండలో నిర్వహించిన సభకు పార్టీ అర్బన్ జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి అధ్యక్షత వహించగా, ఖిలావరంగల్ సభకు మాజీ కార్పొరేటర్ కొప్పుల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. నాయకులు జాన్ వెస్లీ, ఎస్.రమ, ఎంవీ రమణ, పి.ఆశయ్య, కె.నగేశ్, ఎం.శోభన్ నాయక్, అబ్బాస్, జి.రాములు, వెంకట్రాములు, 9వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి శ్రీలత, మర్రి శ్రీనివాస్, కొప్పుల శ్రీనివాస్, బోగి సురేశ్, నలిగంటి రత్నమాల తదితరులు పాల్గొన్నారు.