మీలాంటి వారు ఉండగా.. మీ సమాధానాన్ని అంగీకరించను: కేటీఆర్కు హీరోయిన్ ఈషా
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఎవరైనా ప్రశ్నలు సంధించినా, సమస్యలు ముందుకు తీసుకు వచ్చినా సాధ్యమైనంత వరకు స్పందిస్తుంటారు. తాజాగా, నటి ఈషా రెబ్బా ప్లాస్టిక్ నిషేధం గురించి ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ వెంటనే స్పందించారు. అయితే కేటీఆర్ సమాధానాన్ని అంగీకరించలేనని చెప్పారు.
దేశంలోని ప్లాస్టిక్ సమస్య గురించి కేటీఆర్కు ఈషా రెబ్బ ట్వీట్ చేశారు. 'భారతదేశంలో ఏయే రాష్ట్రాలు ప్లాస్టిక్ను బ్యాన్ చేశాయి? పలు రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నమన తెలంగాణ రాష్ట్రం పేరు ఈ జాబితాలో లేకపోవడం నాకు నిరాశ కలిగించింది. ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించి భావి తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు కృషి చేయాలి' అని ట్వీట్ చేశారు.
చట్టం ప్రకారం తీసుకున్నంత మాత్రాన
దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. 'చట్టప్రకారం నిర్ణయం తీసుకున్నంత మాత్రన ప్లాస్టిక్ నిషేధం అనేది జరిగే పని కాదు. ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు కావాలంటే అధికారులకు, ప్రజలకు, ప్లాస్టిక్ తయారీదారులకు సమస్య తీవ్రత గురించి అవగాహన కలగాలి' అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈషా రెబ్బా స్పందన
కేటీఆర్ స్పందనపై ఈషా కూడా స్పందించారు. 'ఇంత త్వరగా స్పందించినందుకు కేటీఆర్ గారికి ధన్యవాదాలు. సమర్థమైన, ప్రతిభావంతమైన మీ లాంటి యువనాయకులు ఉండగా ఇది అసాధ్యమని చెబితే నేను అంగీకరించేందుకు సిద్ధంగా లేను. ప్లాస్టిక్ నిషేధంలో కూడా మన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని కోరుకుంటున్నాను' అని మళ్లీ ట్వీట్ చేశారు.
ముంబైలో ప్లాస్టిక్ నిషేధం
కాగా, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎమ్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ ఉపయోగించే ప్రజలు, దుకాణాదారులు, మాల్స్పై భారీ జరిమానాలు విధిస్తోంది. నిబంధనలకు విరుద్దంగా ప్లాస్టిక్ వినియోగించే వారిపై తొలిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10వేలు, మూడోసారి కూడా వాడితే రూ.25,000 జరిమానాతో పాటు 3నెలల జైలు శిక్ష విధించాలని నిర్ణయించింది.
Recommended Video
అమలులోకి ప్లాస్టిక్ నిషేధం
ఈ నిబంధనలు ఆదివారం(జూన్ 24) నుంచి అమలులోకి వస్తున్నాయి. ఆరు నెలల నుంచే ప్లాస్టిక్ నిషేధంపై మాల్స్, షాపింగ్మాల్స్, రెస్టారెంట్స్, మార్కెట్లలో అవగాహన కల్సిస్తున్నా మార్పు రాకపోవటంతో భారీ జరిమానాలు విధించాల్సి వచ్చిందని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నిధి చౌదరి తెలిపారు. 249 మందితో కూడిన ప్రత్యేక స్క్వాడ్.. బీచ్లు, బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక నిఘా పెడతారన్నారు. జరిమానా చెల్లింపులలో ఎలాంటి అవినీతి జరగకుండా ఈ-బిల్స్ ద్వారా చెల్లించాలని ప్రజలకు డిప్యూటీ కమిషనర్ సూచించారు. పలుమార్లు లా కమిటీతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.