CJI NV Ramana: అంతా మనోళ్లే..నేనూ మినహాయింపు కాదు: ఆ బాధ నాలో ఉండేది: తెలుగువారికి లేఖ
హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ.. దేశ రాజధానికి బయలుదేరి వెళ్లారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత తొలిసారిగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడంతో ఈ పర్యటన ఆరంభమైంది. తిరుమల, తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన నేరుగా హైదరాబాద్కు చేరుకున్నారు. రాజ్భవన్లో బస చేశారు. కుటుంబ సభ్యులతో యాదాద్రి, శ్రీశైలం పుణ్యక్షేత్రాలను దర్శించారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
కరోనా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయలేం, పరిహారం చెల్లించలేం: రాసిచ్చిన మోడీ సర్కార్
ఆ బాధ, లోటును తీర్చిన తెలుగు ప్రజలు..
ఈ సందర్భంగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఓ సుదీర్ఘమైన లేఖ రాశారు. దేశ న్యాయ వ్యవస్థలో తాను అత్యున్నత స్థానానికి చేరుకున్నానని, ఈ సమయంలో తనను చూసి గర్వించడానికి, మనస్ఫూర్తిగా అభినందించడానికి తల్లిదండ్రులు ఈ లోకంలో లేరనే బాధ ఇన్నాళ్లూ ఉండేదని అన్నారు. ఆ బాధను, ఆ లోటును తెలుగు రాష్ట్రాల ప్రజల తీర్చారని ఎన్వీ రమణ పేర్కొన్నారు. తనను కన్న తల్లిదండ్రుల్లా, పసిబిడ్డలాగా తెలుగు ప్రజలు అక్కున చేర్చుకున్నారని, అపారమైన ప్రేమాభిమానాలు, ఆశీర్వచనాలతో ముంచెత్తారని అన్నారు.
ప్రగతిశీల తెలంగాణ సమాజానికి..
నిష్కల్మలమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రగతిశీల తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు తెలుపుకొంటున్నానని ఎన్వీ రమణ చెప్పారు. తన జీవితంలో అత్యంత భావోద్వేగానికి గురైన సందర్భాల్లో ఈ పర్యటన ఒకటిగా నిలిచిపోతుందని అన్నారు. కరోనా వైరస్ను సైతం భయపడక, వారించినా వినక, అసంఖ్యాక ప్రజలు తనను తనవాడిగా చూసుకున్నారని చెప్పారు. తమలో ఒకడిగా, ఆప్తుడిగా అభినందించారని వారికి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకొంటున్నానని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థ బలోపేతమే..
న్యాయవాదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువత, శ్రామికులు, మహిళలు, రైతులు.. ఇలా అన్ని రంగాలకు చెందిన వారు కుల మతాలకు అతీతంగా తనను పలకరించారని గుర్తు చేశారు. ప్రతిఫలాన్ని ఎవరూ ఆశించలేదని, సొంత పనుల గురించి ప్రస్తావించలేదని జస్టిస్ ఎన్వీ రమణ తన లేఖలో పొందుపరిచారు. వారు కోరిందల్లా న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేయాలని మాత్రమేనని అన్నారు. తెలంగాణ సమాజపు నిస్వార్థ గుణానికి, పరిణితికి ఇది ప్రతీక అని అభివర్ణించారు.
అందరికీ థ్యాంక్స్..
ముఖ్యమంత్రి మొదలుకుని, సామాన్య పౌరుడి వరకు ప్రతి ఒక్కరూ కరోనా వంటి అసాధారణ సమయంలో వ్యయ, ప్రయాసలకు ఓర్చి తనకు స్వాగతం పలికారని, అంతా మనోళ్లే అనే తెలంగాణ నైజానికి, సుప్రసిద్ధ హైదరాబాదీ ఆతిథ్యానికి అద్దం పట్టారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఆయన జస్టిస్ ఎన్వీ రమణ కృతజ్ఞతలు తెలిపారు.
Recommended Video
కరోనా ముప్పు తొలగిపోలేదు..
తిరుమల తిరుపతి, యాదాద్రి, శ్రీశైలం దేవస్థానాల పాలక మండళ్లకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. యాదాద్రిని దేశంలోనే అతి ముఖ్య తీర్థ యాత్రా స్థలాల్లో ఒకటిగా తీర్చిదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న కృషి ప్రశంసనీయమని అన్నారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోయిందంటూ శాస్త్రవేత్తలు, ప్రభుత్వం నిర్ధారించేంత వరకూ జాగ్రత్తలను పాటించాలని, నిర్లక్ష్యంగా ఉండొద్దని అన్నారు.