ఓహ్.. ఆయన పదవి సేఫ్..! ఈటలకు పెద్ద ఊరట..!!
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి వర్గంలో కూర్పులతో పాటు మార్పులు కూడా ఉంటాయని చాలా మంది భావించారు. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వస్తుందేమో అని అనుకున్నారు తెలంగాణ టీఆర్ఎస్ శ్రేణులు. ఇదే పరంపరలో మంత్రి ఈటల రాజేందర్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలకు మూల్యం చెల్లించుకుంటారని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈటల మీద చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. కాని సీఎం అందరి అంచనాలను తలకిందులు చేసారు.
మంత్రి వర్గం నుంచి ఎవరి కి ఉద్వాసన పలకలేదు. ఎవరికి గట్టిగా హెచ్చరికలు జారీ చేసిన దాఖలాలు కూడా లేవు. అసంతృప్తి అనేది ఎక్కడైనా రాజుకుంటుందని, కొన్ని రోజుల తర్వాత అదే సర్ధుకుంటుందనే ధోరణి లో వ్యవహరించారు. అందులో భాగంగానే ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్ పైన ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. ఈటల వ్యాఖ్యలకు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పందించారు గాని సీఎం మాత్రం నోరుమెదపకపోవడం విశేషం.
మంత్రి వర్గ విస్తరణ సందర్బంగా రాజ్ భవన్ లో తారసపడ్డ ఈటలను చూసిన చంద్రశేఖర్ రావు చిరునవ్వులు చిందించడం మంత్రి వర్గవిస్తరణ కార్యక్రమానికే హైలైట్ గా నిలిచింది. ఈటల రాజేందర్ అంశంలో సీఎం చంద్రశేఖర్ రావు వ్యూహాత్మకంగా ఆలోచించారు. తనను తిట్టినా... పొగిడినా అందరూ ఒకటే అనే సంకేతాలిస్తూ.. ఏ ఒక్కరినీ మంత్రివర్గం నుంచి తప్పించలేదు. పైగా విపక్షాలకు గట్టిగా సమాధానమిచ్చినట్టుగా.. ఇద్దరు మహిళలకు కేబినెట్ లో చోటు కల్పించారు.
ఇక్కడా మున్నూరు కాపు, కమ్మ, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించి తన చాకచక్యాన్ని చాటుకున్నారు. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ తనకు ఒక్కటేనంటూ బెర్త్ కన్ఫామ్ చేశారు. మామపై అలిగిన హరీష్ అల్లుడు, బీజేపీలోకి జంప్ చేస్తాడని, వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలను కూడగట్టి సీఎం అవుతాడంటూ వస్తోన్న ఊహాగానాలకు తెరదించారు. ఇదిలా ఉంటే, ఇప్పటికీ పది మంది వరకూ సీనియర్ ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయంపై నిరాశగా ఉన్నారట. వీరిని కూడా బుజ్జగించి, దారిలోకి తీసుకువచ్చేందుకు నామినేటెడ్ పోస్టులను గులాబీ బాస్ సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.