ఆ నాయకుడికి ఆసరా దొరికింది...! టికెట్ ఇవ్వడానికి ముందుకొచ్చిన పార్టీ...!!
హైదరాబాద్ : రాజకీయాల్లో ఎప్పుడు ఎంజరుగుతుందో ఏ మాత్రం అంచనా వేయలేం. శిఖరమంత ఎదిగిన నేతలకు పరాభవం తప్పకపోవచ్చు..! అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వారికి అందలం దక్కవచ్చు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాద్యతలు నిర్వహించిన ఆ నాయకుడికి ప్రస్తుతం రాజకీయ వేదిక కరువయ్యింది. తెలంగాణలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన ఆ నాయకుడు స్వతంత్య్రంగా ఎన్నికల బరిలో దిగాలని ప్రణాళికలు రచించుకుంటున్న తరుణంలో సీటిచ్చేందుకు మేం సిద్దంగా ఉన్నామని ప్రకటించింది ఓ రాజకీయ పార్టీ. ఇంతకీ ఎవరా నేత..? ఏంటా పార్టీ..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
సుదీర్ఘ రాజకీయ అనుభవం..! కానీ పట్టించుకోని పార్టీలు..!!
తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగిన ఆయన.. ఈ ఏడాది ప్రారంభంలో చేసిన పలు వ్యాఖ్యల కారణంగా టీడీపీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇక అప్పటి నుంచి ఆ పార్టీపై, అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత దూషణకు దిగారు. అంతేకాదు, ఏపీలో టీడీపీ గెలవకూడదని తిరుమల వెళ్లి మరీ శ్రీవారిని మొక్కుకున్నారు. ఈలోపే తెలంగాణలో ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవడంతో తన రాజకీయ భవిష్యత్పై దృష్టి సారించారు.
జగమంత కుంటుంబం ఆయనది..! ఏకాకి పోరాటం కూడా ఆయనదే..!!
మోత్కుపల్లి, టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని, పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన తెలంగాణ బాధ్యతలు స్వీకరిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇవేమీ వర్కౌట్ కాకపోవడంతో మోత్కుపల్లి నర్సింహులు వచ్చే ఎన్నికల్లో తాను ఆలేరు అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఆలేరు నియోజకవర్గంలో మాత్రం ఆయన, ఆయన అనుచరులు ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు.
స్వతంత్య్రంగా పోటీ...! సీటిస్తామంటున్న రాజకీయ పార్టీ..!!
ఇందులో భాగంగా ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని, ఇదే చివరిసారి అని, మళ్లీ పోటీ చేయనని చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మోత్కుపల్లికి కొంత ఊరట కలిగించే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఆయనకు ఓ పార్టీ మద్దతు తెలిపింది. అంతేకాదు, ఆలేరు నుంచి తమ పార్టీ తరపున మోత్కుపల్లికే అవకాశం ఇస్తామని కూడా ప్రకటించింది. అసలు విషయం ఏమిటంటే.. ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు బహుజన లెఫ్ట్ పార్టీ టికెట్ ఇవ్వనున్నట్లు బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ తెలిపారు.
బీఎల్ఎఫ్ వాకిట్లో మోత్కుపల్లి మొక్క..! ఫలాలు ఇచ్చేనా..?
బీఎల్ఎఫ్ ఎన్నికల బరిలో నిలిచే 29 మంది అభ్యర్థుల పేర్లను శుక్రవారం బీఎల్ఎఫ్ కన్వీనర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఈ జాబితాలో ఆలేరు స్థానానికి అభ్యర్ధిని ప్రకటించకపోగా, మోత్కుపల్లికే మద్దతిస్తామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, ఆయన ఒప్పుకుంటే బీఎల్ఎఫ్ తరపున టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మరి దీనిపై మోత్కుపల్లి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.