అవును ఆయన అలిగారు..! అందుకే అక్కడికి రాకుండా వెళ్లిపోయిన ఫడ్నవీస్..!
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్బంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కలల పంటగా అభివర్ణిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మహారాష్ట్ర.. ఏపీ ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించటం తెలిసిందే. అయితే.. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ రావటానికి పలువురు తప్పు పడుతూ రాకూడదన్న మాటను చెప్పటం తెలిసిందే.
ఇదిలా ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి రావొద్దని తాము కోరుతున్నట్లుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాకు చెప్పటం తెలిసిందే. తెలంగాణలో బీజేపి పార్టీని తొక్కేయాలని భావిస్తున్న చంద్రశేఖర్ రావుకు కేంద్ర స్థాయిలో మాత్రం అదే బీజేపి నేతలతో స్నేహపూర్వక సంబందాలు కలిగి ఉంటారు. గతంలో మిషన్ భగీరథకు, మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ ని ఆహ్వానించి హడావిడి చేసారు చంద్రశేఖర్ రావు. అదే కార్యక్రమానికి రాష్ట్ర బీజేపి నాయకులకు మాత్రం అంతంత మాత్రమే ప్రాధాన్యతనిచ్చారు చంద్రశేకర్ రావు.
ఇదే అంశాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కి లక్ష్మణ్ వివరించినట్టు సమాచారం.అయితే.. సొంత పార్టీ నేతల వ్యాఖ్యలకు భిన్నంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రారంభోత్సవానికి హాజరైన ఫడ్నవీస్ ను తన పక్కనే ఉంచుకొని ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తగా తీసుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద జరిగిన కార్యక్రమం వద్ద ఉన్న ఫడ్నవీస్.. ఆ తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. మరేం అయ్యిందో కానీ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడకు హాజరు కాలేదు. స్థానిక బీజేపి నేతల హితబోదతోనే ఫడ్నవీస్ ఆ కార్యక్రమం మద్యలో వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
అయితే.. గవర్నర్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం హాజరయ్యారు. దాదాపు 54వేల హెచ్ పీ హార్స్ పవర్ ఉన్న భారీ మోటార్లను ఈ సందర్భంగా ప్రారంభించారు. కాళేశ్వరం వద్ద శిలాఫలకాన్ని జగన్ ఆన్ చేస్తే.. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు స్టార్ట్ చేయటం గమనార్హం. ఈ పంప్ హౌస్ నిర్మాణంలో మెగా.. నవయుగ.. ఎల్ అండ్ టీతో సహా పెద్ద పెద్ద సంస్థలు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కార్యక్రమంలో పాల్గొని.. మరో కార్యక్రమానికి రాకుండా వెళ్లిపోవటం పలువురి దృష్టిని ఆకర్షించింది.