కేసీఆర్తో ఛత్రపతి శివాజీ వారసుడు భేటీ: బీఆర్ఎస్లో..!!
హైదరాబాద్: మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహరాజ్ 13వ తరం వారసుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజె ఇవ్వాళ హైదరాబాద్ కు వచ్చారు. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అయ్యారు. భారత్ రాష్ట్ర సమితి నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత సహా కీలక నాయకులు ఇందులో పాల్గొన్నారు. సమకాలీన రాజకీయాలు, వివిధ అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి.
ఇది మర్యాదపూరక భేటీగా చెబుతోన్నప్పటికీ- మహారాష్ట్రలోని నాందెడ్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్న నేపథ్యంలో- ఈ సమావేశం ఏర్పాటు కావడం ఆసక్తి రేపుతోంది. ప్రగతి భవన్కు వచ్చిన శంభాజీ రాజేకు కేసీఆర్ శాలువా కప్పారు. పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. తెలంగాణ సాధించిన ప్రగతి, సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు విషయాల గురించి శంభాజీ రాజే ఈ సందర్భంగా ఆయనను అడిగి తెలుసుకున్నారు.
రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో సహా అన్ని వర్గాల ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. తెలంగాణ అభివృద్ధి నమూనా, సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో కూడా అమలు కావాల్సిన అవసరం ఉందని శంభాజీ రాజె ఆకాంక్షించారు. అభివృద్ధి అంశాలతో పాటు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ తో సుదీర్ఘంగా చర్చించారు.
ప్రజల అభివృద్ధి, దేశ సమైక్యత కోసం వివిధ రాజకీయా పార్టీలు సరికొత్త అజెండాలతో ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉందని శంభాజీ రాజె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా శంభాజీరాజే పూర్వీకులు ఛత్రపతి శివాజీ మహరాజ్ నుంచి సాహు మహరాజ్ వరకు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా వారి పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా 'రాజర్షి సాహు ఛత్రపతి' పుస్తకాన్ని కేసీఆర్కు బహూకరించారు.