నిర్మానుష్యంగా మారిన కోడెల నివాసం..! అలుముకున్న విషాద ఛాయలు..!!
హైదరాబాద్ : హైదరాబాద్, బంజారహిల్స్ లోని కోడెల నివాసం నిర్మానుష్యంగా మారింది. సెక్యూరిటీ సిబ్బంది తప్ప ఏ ఒక్కరూ కూడా నివాసంలోలేరు. ప్రజల అంతిమ సందర్శనం కోసం కోడెల మృత దేహాన్ని గుంటూరు కు తరలించిన విషయం తెలిసిందే. ఐతే కెన్యా దేశం నుండి కొద్ది గంటల క్రితమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన తనయుడు కోడెల శివరాం ప్రసాద్ అంతిమ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా బంజారాహిల్స్ పోలీసులు మాత్రం కోడెల అకాల మరణాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కోడెల శివరాం ప్రసాద్ ను అటు ఏపి పోలీసులతో పాటు ఇటు తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా బంజారహిల్స్ లోని ఇంటి మొదటి అంతస్తులో మాత్రం కోడెల పడక గది ఉన్నట్టు తెలుస్తోంది.
నిన్న సోమవారం ఉదయం సుమారు ఏడున్నర ప్రాంతంలో కోడెల శివప్రసాద్ ఫ్యాన్ కు ఉరి వేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన కుమార్తె విజయ లక్షి 8గంటల ప్రాంతంలో కోడెలకు టీ ఇచ్చేందుకు తన బెడ్ రూం తలుపు తట్టగా సమాధానం రాలేదని, తండ్రి నిద్రలో ఉన్నట్టు భావించిన విజయలక్షి, కాసేపు సమయం ఇవ్వాలని తన గదిలోకి వెళ్లిపోయినట్టు సమాచారం. తర్వాత తొమ్మది గంటల ప్రాంతంలో మరో సారి తండ్రిని లేపేందుకు ప్రయత్నించారు. మళ్లీ సమాధానం రాకపోయే సరికి కాస్త ఆందోళనకు గురైనప్పటికి మరి కాస్త సమయం ఇచ్చిన తర్వాత నిద్రలేపుదామని విజయలక్షి భావించినట్టు తెలుస్తోంది.
తర్వాత 10గంటలకు మరోసారి తండ్రి కోడెల గది తలుపు తట్టగా సమాధానం రాకపోయేసరికి తీవ్ర ఆందోళనకు గురైన విజయ లక్షి గన్ మెన్ తో పాటు వ్యక్తిగత డ్రైవర్ కు విషయాన్ని చేరవేసినట్టు సమాచారం. గన్ మెన్ తలుపు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించగా ఎంతకూ తెరుచుకోక పోవడంతో కిటికి మీద నుండి పైకి అంతస్తుకు చేరుకుని గ్రిల్స్ తొలగించి, కిటికి తెరచి చూసేసరికి కోడెల ఫ్యాన్ కి వేళాడుతున్నట్టు విజయలక్షికి సమాచారం అందిచినట్టు తెలుస్తోంది. వెంటనే కిటికిలో నుండి లోనకు వెళ్లి కోడెల శివప్రసాద్ ను ఫ్యాన్ నుండి తప్పించి హుటా హుటిన బసవతారకం క్యాన్సర్ హాస్పత్రికి తరలించినట్టు సమాచారం. కాగా అప్పటికే కోడెల మృతిచెందినట్టు డాక్టర్లు దృవీకరించినట్టు తెలుస్తోంది.