తెలంగాణ జిల్లాలో విమాన సర్వీసులు..! 6 ఎయిర్పోర్టులకు ప్రతిపాదనలు..!!
హైదరాబాద్ : విమానయాన రంగంలో తెలంగాణ జిల్లాలు వెనకబడిఉన్నాయని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తప్ప ఏ జిల్లాల్లోనూ మరో విమానాశ్రయం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మొత్తం ఆరు విమానాశ్రయాలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ లో మారుమూలన ఉన్న ప్రజలు హైదరాబాద్ వచ్చి విమాన సేవలు ఉపయోగించుకుంటున్నారు తప్ప జిల్లాల్లో ఈ సౌకర్యం లేదు. ఇందుకోసం తెలంగాణ జిల్లాల్లో కూడా విమానాశ్రయాలు నిర్మించాలని ప్రతిపాదనలను సిద్దం చేస్తోంది.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రయాణ సమయం మరింత తగ్గించేందుకు విమానాలు ఎంతో అవసరమని కూడా భావిస్తోంది. అందుకోసమే తెలంగాణ ప్రజలకు కూడా విమాన సేవలు మరింత అందుబాటులోకి తేవడానికి రాష్ట్రంలో ఆరుచోట్ల కొత్తగా విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇతర రాష్ట్రాలతో పోల్చినపుడు తెలంగాణ విమానయానంలో వెనుకబడి ఉంది. తెలంగాణలో కేవలం శంషాబాద్లోనే మాత్రమే ఎయిర్పోర్ట్ ఉంది. దీంతో తెలంగాణ ప్రజలు వియాన ప్రయాణం చేయాలంటే హైదరాబాద్కు రావాల్సిందే. ఆ లోటు తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం కట్టింది. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, వరంగల్, మహబూబ్నగర్, కొత్తగూడెంలలో విమానాశ్రయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉడాన్ కింద వీటిని నిర్మించాలని యోచిస్తోంది. వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్లో ఇప్పటికే ఎయిర్ స్ట్రిప్లు ఉన్నాయి. వరంగల్ ఎయిర్ స్ట్రిప్ను సైనిక అవసరాలకు నిర్మించారు. ఎయిర్పోర్టులు నిర్మించాలని ప్రతిపాదించిన ప్రాంతాల్లో అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)ని కన్సల్టెన్సీగా నియమించింది. ఈ సంస్థ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సెప్టెంబర్ నాటికల్లా నివేదిక అందజేయనున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే తెలంగాణ జిల్లాల్లో కూడా ఇక ఎయిర్ బస్సులు కనువిందు చేయనున్నాయి.