పేరుకే ఉత్తమ తహసిల్దారు.. ఇంటి నిండా నోట్ల కట్టలే..! మేడం హస్తవాసి అదుర్స్..!!
హైదరాబాద్: ఎంతటి ఉత్తమ అదికారైనా ఒక్కోసారి నోట్ల కట్టలకు దాసోహం కాక తప్పదు. కొంత కాలం విధి నిర్వహణలో నిబద్దతగా పని చేసినా కొంత కాలం తర్వాత నియమాలు పక్కన పెట్టి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని పించడం సహజంగా మారింది. అచ్చం అలాంటి సంఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆమె ఒక ఉత్తమ తహసిల్దార్ కానీ లంచం తీసుకోవడం కలకలం సృష్టించింది. లంచం తీసుకుంటు పట్టుబడ్డ వీఆర్వో ఇచ్చిన సమాచారం ఆధారంగా తహసీల్దార్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ(సీబీఐ) అధికారులకు అక్కడ ఏకంగా 93 లక్షల రూపాయల నగదు కనిపించడంతో అవాక్కాయ్యారు. ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో ఇంత భారీ ఎత్తున నగదు ఉండడం గడిచిన పదేళ్ల కాలంలో ఇదే తొలిసారని వారు పేర్కొన్నారు.
ఉత్తమ తహసీల్దార్ ఇంట్లో కట్టలే కట్టలు..! అవాక్కైన అదికారులు..!!
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయపల్లికి చెందిన రైతు మామిడిపల్లి భాస్కర్ తన 9.07 ఎకరాల పొలానికి కేటాయించిన నంబరు సర్వే రికార్డుల్లో లేదంటూ రెండు నెలల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులిస్తే తప్ప పని జరగదంటూ కొందుర్గు వీఆర్వో అనంతయ్య చెప్పాడు. 8లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందులో తనకు ఐదు లక్షల రూపాయలు, తహసీల్దార్ లావణ్యకు 3 లక్షల రూపాయలు అని చెప్పాడు.
అవినీతికి ఎవరూ అతీతులు కాదు..! నిరూపించిన తహసిల్దారు ఉదంతం..!!
గత నెలలో 30 వేల రూపాయలు బయానాగా తీసుకున్నాడు. బయానా ఇచ్చిన భాస్కర్.. లంచం ఎందుకివ్వాలని తనకు తానే ప్రశ్నించుకున్నారు. కొద్దిరోజుల క్రితం అవినీతి నిరోదక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచనల మేరకు భాస్కర్ బుధవారం 4లక్షల రూపాయలతో కేశంపేట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. వీఆర్వో అనంతయ్యకు లంచం ఇస్తుండగా.. అవినీతి నిరోదక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
క్రింది స్ధాయి అదికారులను అడ్డం పెట్టుకుని లంచాలు..! తహసిల్దార్ బరితెగింపు..!!
తహసీల్దార్ వి.లావణ్య ఆదేశాల మేరకే తాను లంచం వసూలు చేస్తున్నానని అనంతయ్య చెప్పాడు. దీంతో హైదరాబాద్ అవినీతి నిరోదక శాఖ అధికారులు రాజధాని శివారు హయత్నగర్లోని లావణ్య ఇంటికి చేరుకున్నారు. తహసీల్దార్ లావణ్య ఇంట్లో సోదాలు మొదలుపెట్టిన అధికారులు భారీ ఎత్తున నగదును చూసి ఆశ్చర్యపోయారు. మొత్తం 93 లక్షలు రూపాయలుగా లెక్క తేల్చారు. ఈ నగదుకు సంబంధించి వివరాలు కావాలని ఆమెను అడగ్గా... సమాధానం చెప్పలేదు.
డబ్బుతో పాటు బంగారం..! ఆశ్చర్యపోతున్న అదికారులు..!!
వీటితో పాటు బంగారు ఆభరణాలను 40 తులాలుగా గుర్తించారు. నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. లావణ్య.. 2016 నుంచి కేశంపేట తహసీల్దారు. ఆమె భర్త జీహెచ్ఎంసీలో సూపరింటెండెంట్. ఇంకా ఏవైనా అక్రమాలున్నాయేమోనని కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోదక శాఖ అధికారులు సాయంత్రం నుంచి రికార్డులను పరిశీలిస్తున్నారు. అనంతయ్యతో పాటు వి.లావణ్యపై కేసు నమోదు చేశామని అవినీతి నిరోదక శాఖ ఉప సంచాలకుడు రమణకుమార్ తెలిపారు. వీఆర్వోను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచాక జైలుకు తరలించారు.