మేరీ మాత విగ్రహం నుంచి రక్త కన్నీరు: తరలిన జనం
జిల్లాలోని ఓ చర్చిలో మేరీమాత విగ్రహం నుంచి కన్నీరు, రక్తం వంటి ద్రవం కారుతుండటం సంచలనంగా మారింది. దీంతో విషయం తెలిసిన జనం తండోపతండాలుగా చర్చికి తరలివచ్చారు.
వరంగల్: జిల్లాలోని ఓ చర్చిలో మేరీమాత విగ్రహం నుంచి కన్నీరు, రక్తం వంటి ద్రవం కారుతుండటం సంచలనంగా మారింది. దీంతో విషయం తెలిసిన జనం తండోపతండాలుగా చర్చికి తరలివచ్చారు.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా ఐనవోలు మండలం సింగారం శివారులోని గుంటూరుపల్లిలోని లూర్దుమాత చర్చిలో ఆదివారం మేరీ మాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. కాగా, బుధవారం ఉదయం ఈ విగ్రహం కళ్ల నుంచి రక్తం రూపంలో ఉన్న కన్నీరు రావడాన్ని చర్చి ఫాదర్ గుర్తించారు.
ఈ విషయం ఇంఛార్జ్ బిషప్ జోసఫ్కు సమాచారం అందించగా ఆయన మేరీమాత విగ్రహాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. సమీప గ్రామస్తులు, ప్రజలు తండోపతండాలుగా వచ్చి మేరీమాతను దర్శించుకుంటున్నారు.
మానవులు స్వార్థంతో జీవిస్తూ పాపాలు చేస్తున్నారని, అందుకే మేరీమాత బాధతో కన్నీరుకార్చి ఉంటుందని చర్చీ ఫాదర్ మార్ రెడ్డి అన్నారు. తన పిల్లలందరూ బాగుండాలని మేరీమాత ఎప్పుడూ కోరుకుంటుందని చెప్పారు. అయితే, విగ్రహం తయారీలో వాడిన పదార్థాలను బట్టి ఇలా జరిగి ఉంటుందని పలువురు అంటున్నారు.