సరిహద్దు వివాదం.. "కాగ్నా" పంచాయితీ వార్.. తెలంగాణ, కర్ణాటకలో ఉత్కంఠ
హైదరాబాద్ : తెలంగాణ, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం ముదురుపాకాన పడుతోంది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని కాగ్నా నది పంచాయితీ మరోసారి తెరపైకి వచ్చింది. ఇసుక విషయంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రగులుతోంది.
కర్ణాటక కాంట్రాక్టర్లు తమ ప్రాంతంలోకి చొచ్చుకొస్తున్నారనేది తెలంగాణ అధికారుల ఆరోపణ. అయితే మీరు అడ్డుకోవడంతోనే సమస్య వస్తోందని.. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిర్మాణాలు ఆగిపోతున్నాయనేది అక్కడి అధికారుల వాదన. ఇలా ఈ రెండు రాష్ట్రాల మధ్య కాగ్నా నది పంచాయతీ ఉత్కంఠ రేపుతోంది.
ఇసుక లొల్లి.. హద్దుల పంచాయితీ
కాగ్నా పరివాహక ప్రాంతం పోతంగల్ దగ్గర దాదాపు లక్షన్నర మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం అక్కడి గ్రామీణాభివృద్ధి సంస్థకు అనుమతిచ్చింది. 2016 సంవత్సరం నుంచి ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఇసుకను తరలించేలా కొంతమంది కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. అదలావుంటే కర్ణాటక కాంట్రాక్టర్లు హద్దులు దాటుతున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈనేపథ్యంలో ఇటీవల బషీరాబాద్ మండలం క్యదీర్గ గ్రామానికి చెందిన రైతులు అక్కడి కాంట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో మరోసారి రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తలెత్తింది. చివరకు పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సిన పరిస్థితి. హద్దులు గుర్తించేవరకు ఇసుక తరలింపును నిలిపివేయాలని కర్ణాటక కాంట్రాక్టర్లకు సూచించారు.
సరిహద్దు వివాదం.. అధికారుల భేటీ
తెలంగాణ, కర్ణాటక మధ్య జరుగుతున్న కాగ్నా పంచాయితీపై రెండు రాష్ట్రాల అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈనేపథ్యంలో మంగళవారం సమావేశమయ్యారు. బషీరాబాద్ ఎమ్మార్వోతో పాటు కర్ణాటకకు చెందిన అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. మ్యాప్ ఆధారంగా డిస్కషన్ జరిగింది. అయితే సగానికి పైగా నది భూభాగం తెలంగాణ పరిధిలోకే వస్తుందన్నారు బషీరాబాద్ ఎమ్మార్వో. ఏదిఏమైనా సరిహద్దులు తేల్చాకే కర్ణాటక అధికారులు ఇసుక తవ్వకాలు జరిపించాలని కోరారు.
"కాగ్నా" వార్ కొలిక్కివచ్చేనా?
కాగ్నా పంచాయితీలో సరిహద్దు వివాదం చెలరేగడంతో అది తేలేంతవరకు పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు చించోళి డీఎస్పీ (కర్ణాటక). దీనిపై స్పందించిన బషీరాబాద్ ఎమ్మార్వో బుధవారం మరోసారి భేటీ అవుదామని సూచించారు. ఆర్డీవో దగ్గర సమావేశమై సరిహద్దు అంశం చర్చిద్దామని కోరడంతో కర్ణాటక అధికారులు కూడా ఓకే చెప్పారు. మొత్తానికి బుధవారం నాటి సమావేశంలోనైనా కాగ్నా పంచాయితీకి తెరపడుతుందో లేదో చూడాలి.