ఆ బస్సును 37 ముక్కలు చేసారు..! దొంగతనానికే కొత్త అర్థం చెప్పిన కేటుగాళ్లు ..!!
హైదరాబాద్ : అఫ్జల్గంజ్ పరిధిలో కుషాయిగూడ ఆర్టీసీ బస్సు చోరీకి గురైందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా బస్సు చోరీ నిందితులను గుర్తించామని వివరించారు. ఈ సందర్భంగా కేసు వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో వివరించారు. ఇద్దరు అన్నదమ్ములు బస్సు చోరీకి పాల్పడ్డారని, నాందేడ్లో బస్సును ఇతరులకు అప్పగించారని చెప్పారు. బస్సును నాందేడ్కు 10 కిలోమీటర్ల దూరంలోని షెడ్డుకు చేర్చి, నిందితులు బస్సును 37 ముక్కలుగా చేశారని, బస్సును తుక్కుగా చేసి విక్రయించాలనేది నిందుతుల ఆలోచన అని సీపి వివరించారు.
బస్సుకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని సీపి తెలిపారు. అఫ్జల్గంజ్ నుంచి బస్సు ఎత్తుకెళ్లిన నిందితులు ఇద్దరిని గుర్తించామని, వీరిద్దరిపై గతంలో పలు కేసులు ఉన్నాయన్నారు. ఇద్దరు నిందితులు అన్నదమ్ములని, దుబాయ్లో భారీ వాహనాలు నడిపిన అనుభవం వీరికి ఉందని, జల్సాలకు అలవాటు పడి నిందితులు చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. అఫ్జల్గంజ్ పరిధిలో వీరు ఆటోలు నడిపేవారని, బస్సు చోరీ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదు చేశామని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు.