ష్.. గప్ చుప్.. సాయంత్రంతో మూగబోనున్న మైకులు..! ముగియనున్న ఎన్నికల ప్రచారం..!!
హైదరాబాద్ : గత 20రోజులుగా మైకులతో, నేతల ప్రసంగాలతో, రోడ్ షోలతో, బహిరంగ సభలతో హోరెత్తిపోయిన హుజూర్ నగర్ నియోజక వర్గం నేటి సాయత్రం తో మూగబోనుంది. ఉప ఎన్నిక ప్రచారానికి నేటి సాయంత్రం ఐదు గంటలతో సమయం ముగిసిపోనుండడంతో ప్రచారానికి తెరపడనుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, టీడిపి, భారతీయ జనతా పార్టీలు తారా స్థాయిలో ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నాయి.
గులాబీ పార్టీ నుంచి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేసారు. 17 తారీఖున హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బహిరంగ సభ అనూహ్యంగా రద్దు కావడంతో కార్యకర్తల్లో కాస్త అసంతృప్తి చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గత రెండు రోజులుగా రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొనడంతో పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున జోష్ వచ్చినట్టు తెలుస్తోంది.
హుజూర్ నగర్ నియోజక వర్గానికి జరగనున్న ఉపఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగియనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా గెలుపొందడంతో హుజూర్ నగర్ నియోజకవ ర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూర్ నగర్ లో గెలుపును అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఈనెల 21 అంటే సోమవారం ఉదయం7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. హుజుర్ నగర్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. నేటి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం ఉంటుంది. కాగా ఓటర్ తీర్పు పై ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 24న వెల్లడించనున్నారు.